అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచిస్తున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ బీజేపీ వంచన రాజకీయం బయట పడుతున్నది. తెలంగాణ హక్కు అయిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రం తాజాగా వెనక్కు తగ్గింది. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఆలోచనే లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించడంపై గిరిజనం మండిపడుతున్నది. వాస్తవానికి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం బీజేపీకి అలవాటుగా మారింది. మాట మీద నిలబడలేని మోదీ సర్కారు.. గతంలో పసుపుబోర్డు అంశంలోనూ ఇలాగే వ్యవహరించింది. నిజామాబాద్ ఎంపీ స్థానంలో గెలిపిస్తే ఐదు రోజుల్లోనే బోర్డు తెస్తామన్న బీజేపీ నేతలు.. ఎన్నికల్లో గెలుపొందాక బోర్డు తేకుండా రైతుల మనోభావాలను దెబ్బ తీశారు. తాజాగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ వెనక్కి తగ్గి గిరిజనులను వంచించారు. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓట్ల కోసం మాయ మాటలు చెప్పడం, అవసరమైతే ప్రజలను రెచ్చగొట్టి తమవైపు తిప్పుకోవడం, వైషమ్యాలతో స్వార్థ రాజకీయాలకు పాల్పడడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మూడున్నరేండ్లు గడుస్తున్నా అతీగతి లేదు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిజామాబాద్ జిల్లా రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో గిరిజన ప్రజలు చేరారు. బీజేపీ చేతిలో నిలువునా మోసపోయే దుస్థితి ఏర్పడింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేస్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటూ గప్పాలు చెప్పారు. తీరా ఫ్యాక్టరీ ఏర్పాటు ఏదంటూ ప్రశ్నిస్తుండగా ఇదిగో అదిగో అంటూ పబ్బం గడిపారు. తీరా ఇప్పుడు ఫ్యాక్టరీ ఆలోచనే లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో బీజేపీ నీచ రాజకీయం మరోసారి తేటతెల్లమైంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై గిరిజన ప్రజలంతా విమర్శిస్తున్నారు. బీజేపీ తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదే వివక్ష…
తెలంగాణ అంటేనే కేంద్రంలోని బీజేపీకి కొంత కాలంగా రుచించడం లేదు. సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఢీకొట్టలేక ప్రభుత్వపరంగా చీటికి మా టికి పేచీలు పెడుతూ జనాన్ని సతాయిస్తూ కపట నీతిని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాలను యథేచ్ఛగా దెబ్బతీస్తోంది. నిధుల మంజూరులో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వెనుకడుగు వేస్తూ దమనకాండను కొనసాగిస్తోం ది. సమైక్య భారతదేశంలో రాష్ర్టాలతో సత్సంబంధాలను నెరపాల్సిన కేంద్రమే గతంలో ఎన్నడూ లేని విధంగా విడ్డూరంగా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ యేతర ప్రభుత్వం కొనసాగుతుండడం, కేంద్రానికి దీటుగా సీఎం కేసీఆర్ పనితీరు ఉండడం, మోదీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న కేసీఆర్ను నేరుగా ఢీకొట్టలేక దొడ్డి దారిలో ప్రజలను నష్టపరిచే కుట్రలకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో విధంగా వివక్షను చూ పుతూ సతాయిస్తున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీని అటకెక్కించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది.
గిరిజనులపై దెబ్బ…
కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేష్టలతో లక్షలాది మంది గిరిజనుల అభివృద్ధిపై దెబ్బకొట్టారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా సరిహద్దులో భారీ ఎత్తున ఉక్కు నిక్షేపాలున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ మూలంగా తెలంగాణ రాష్ర్టానికి ఎంతో ఉపయుక్తం కావడంతో పాటు గిరిజనుల స్థితిగతులు మారే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా స్థానిక గిరిజన ప్రజలకు ఎంతో లబ్ధి జరిగే ఆస్కారం ఏర్పడేది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా తమ బతుకులు బాగు పడతాయని మహబూబాబాద్ జిల్లాలోని ప్రజలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర గిరిజనులు అభిలాషించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం అనైతికంగా ఇచ్చిన హామీని పక్కన పెట్టి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనే లేదంటూ ప్రకటించడం విడ్డూరంగా మారింది. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రకటన చేయడం సిగ్గుచేటని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రంతో కొట్లాడి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాల్సిన కిషన్ రెడ్డి… అందుకు విరుద్ధమైన ప్రకటన వెలువరించడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పసుపు బోర్డు మాదిరిగానే…
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ ద్వంద్వ నీతిని అవలంబించి దొడ్డి దారిలో ఎంపీ సీటును దక్కించుకున్నది. నోటికొచ్చిన ప్రకటన చేసి రైతులను తమ వైపు తిప్పుకున్నది. ప్రధానంగా 2019 ఎన్నికల సమయంలో పసుపు బోర్డు డిమాండ్ రాజుకుంది. పసుపు రైతులు సైతం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో కొట్లాడారు. గతంలో టీఆర్ఎస్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఎనలేని కృషి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. 2014 నుంచి 2019 వరకు పసుపు బోర్డు ఊసే ఎత్తని బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో రైతులకు హామీలు గుప్పించింది. బీజేపీని గెలిపిస్తే బోర్డు ఏర్పాటు ఖాయమని పదే పదే చెప్పి తీరా గెలుపొందిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా పసుపు బోర్డు ఏర్పాటు ఆలోచనే లేదంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రజలను ఉసురుమనిపించింది. అచ్చంగా పసుపు బోర్డు అమలు వి షయంలో బీజేపీ మొండి చేయి చూపినట్లే బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ అంశంలోనూ అదే తీరును కనబరిచి ప్రజలకు నష్టం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఒక విధంగా ప్రవర్తించడం, ఎన్నికలయ్యా క మరో విధంగా వ్యవహరిస్తోన్న బీజేపీ ఊసరవెల్లి మాదిరి రాజకీయాలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రజా సంక్షేమాన్ని మరిచిన బీజేపీ
బోధన్ రూరల్ : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని మరిచిపోయింది. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రాష్ట్రంలో ఎ లాంటి ప్రాజెక్టులను ఏర్పా టు చేయడం లేదు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
-నేనావత్ మోహన్ నాయక్, రాజీవ్నగర్ తండా
గిరిజనులంటే పట్టదా?
కేంద్ర ప్రభుత్వానికి గిరిజనులంటే పట్టదు. మమ్మ ల్ని కేవలం ఓటు బ్యాం కు గానే కేంద్రం వినియోగించుకుంటున్నది. గిరిజనుల బతుకులు మార్చే బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం పక్కదారి పట్టిస్తే గిరిజనులు పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుంది.
– ఆర్. శంకర్, రాజీవ్నగర్ తండా, బోధన్ మండలం.
మరోసారి కేంద్రం మోసం..
గాంధారి : గిరిజనులను బీ జేపీ మరోసారి మోసం చే సింది. గతంలో నిజామాబాద్లో పసుపు బోర్డును ఏ ర్పాటు చేస్తామని మాట త ప్పి ఇప్పుడు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆ లోచన లేదని ప్రకటించడం విడ్డూరం. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే చాలా మంది గిరిజన యువతకు ఉపాధి లభిస్తుంది.
– బలరాం నాయక్, టీఆర్ఎస్ నాయకుడు, గాంధారి
గిరిజనులపై చిన్న చూపు..
గిరిజనులపై బీజేపీ చిన్నచూపు చూస్తున్నది. బయ్యారంలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేస్తే చాలా మంది గిరిజనులకు ఉపా ధి, ఉద్యోగ అవకాశాలు లభించేవి. గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవడానికే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం లేదు.
– చందర్నాయక్, టీఆర్ఎస్ నాయకుడు, గాంధారి మండలం
వెనక్కి తగ్గడం సిగ్గు చేటు
బాన్సువాడ రూరల్ : మహబూబాబాద్ జిల్లాలో బ య్యారం స్టీల్ ప్లాంట్ నెల కొల్పుతామని గత ఎన్నిక ల్లో వాగ్దానం చేసి కేంద్రం లో అధికారంలోకి వచ్చిన బీజేపీ తీరా స్టీల్ ప్లాంట్ ఏ ర్పాటుపై వెనక్కు తగ్గడం సిగ్గు చేటు. రాష్ట్రం విషయంలో కేంద్రం అవలంబిస్తున్న తీరు బా గోలేదు తక్షణమే స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
– రవి నాయక్, పోచారం తండా