మోర్తాడ్/ఏర్గట్ల, నవంబర్ 9 : పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సఖ్యతగా ఉన్నప్పటికీ నిధులు ఇవ్వడంలో వివక్ష చూపి కుట్రలు పన్నిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేమని వారు తెలుసుకున్నారని అన్నారు. ఇక ఆట మొదలైందని, ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రూ.కోటీ 10 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏర్గట్ల మండలంలో రూ.90 లక్షలతో చేపట్టనున్న తొర్తి -ఏర్గట్ల బీటీ రోడ్డు పునరుద్ధరణకు పనులకు భూమిపూజ చేశారు. కమ్మర్పల్లి మండలం ఆర్ఆర్ నగర్, ఉప్లూర్ గ్రామాల్లో నిర్మించిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. మునుగోడులో రాజ్గోపాల్రెడ్డికి అమిత్షా రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఆశజూపి ఉప ఎన్నిక తెచ్చారని అన్నారు. బీజేపీ ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా మునుగోడు ప్రజలు తెలంగాణ పక్షాన నిలబడ్డారని, డబ్బుతో ఓడించాలనే డ్రామాలను తిప్పికొట్టారని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకునేవారు ఎవరో ప్రజ లు గమనించాలని కోరారు. కిషన్రెడ్డి, బండిసంజయ్, అర్వింద్ మొదటి నుంచి అబద్ధాలే మాట్లాడున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా గ్రామాల అభివృద్ధికోసం తాను మంజూరు చేయించిన నిధులను గుర్తుచేస్తూ బీజేపీ నాయకులు ఎన్ని డబ్బులు తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నలుమూలలూ అన్ని రంగల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని, అందుకే దేశమంతా.. కేసీఆర్, తెలంగాణ వైపు చూస్తున్నదని అన్నారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు శివలింగు శ్రీనివాస్, కొలిప్యాక ఉపేందర్రెడ్డి, గౌతమి, జడ్పీటీసీలు బద్దం రవి, గుల్లే రాజేశ్వర్, రాధా రాజాగౌడ్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షులు కల్లెడ ఏలియా, ఎనుగందుల రాజపూర్ణనందం, రేగుంట దేవేందర్, ఎంపీటీసీలు ఆస్మా అజారుద్దీన్, జక్కని మధుసూదన్, అనిల్, వైస్ ఎంపీపీ సల్ల లావణ్య, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.