కామారెడ్డి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రం సిద్ధించాకే రైతులు పంటలను సాగుచేసి లాభాల్లోకి వచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమైక్యపాలనలో అన్నదాతలు నానా కష్టాలు పడ్డారని, వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో వ్యవసాయం పండుగలా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్రోడ్డు వద్ద శనివారం నిర్వహించిన రైతు దినోత్సవంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గతంలో రైతులు అంటే చిన్నచూపు ఉండేదని, కానీ ఇప్పుడు గల్లా ఎగరేసుకొనే పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్పై రైతుల ఆదరణ ఎప్పటికీ ఉండాలని కోరారు.
దేశానికి తెలంగాణ మోడల్
తెలంగాణ మోడల్ అంటే ఏమిటని ఢిల్లీలోని జాతీయ మీడియా మిత్రులు తనను అడిగారని తెలిపారు. నదీ జలాలను 80 మీటర్ల నుంచి 610 మీటర్లపైకి ఎత్తిపోసి పొలాలకు నీళ్లు ఇవ్వడమే అని, ఐదేండ్లలో 65లక్షల మంది రైతులకు రూ.65వేల కోట్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్ అని చెప్పానని అన్నారు. ప్రతి రైతుకూ రైతుబీమా, ప్రతి ఎకరానికీ నీళ్లందించడమే తెలంగాణ మోడల్ అని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరిస్తుందని అన్నారు. ఎండకు, వానకు బెదరకుండా దేశానికి రక్షణగా సైనికులు కాపలా ఉంటారని, అదే తరహాలో రైతులు పొలంలో పని చేస్తూ చెమట చుక్క చిందిస్తున్నందునే ప్రతి ఒక్కరూ కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను చూసి ఏడ్చామన్నారు. రైతుల కోసం గత ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. నేడు తెలంగాణలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై పీడీ యాక్టు పెట్టి, జైల్లోకి పంపించి రైతులను కాపాడుకుంటున్నామని అన్నారు. వరి సాగులో గ తంలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు రెం డో స్థానానికి చేరుకున్నదని తెలిపారు. పంజాబ్ను కూడా దాటేసి మొదటి స్థానానికి చేరుకుంటామన్న విశ్వాసం ఉందన్నారు. రైతుబంధు ఇవ్వగానే అయిపోయిందా అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారని, ఆ విషయం కేసీఆర్కు తెలుసని, అందుకే ఉచిత విద్యుత్తోపాటు అనేక రైతు అనుకూల కార్యక్రమాల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల కళ్లకు కనిపించేలా, చెవులకు వినిపించేలా అభివృద్ధిని తెలియజేయాలని సూచించారు.
రైతులు లాభదాయక పంటల వైపు ఆసక్తిచూపాలి
రైతులు వరి, పత్తి వంటి పంటలకు మాత్రమే పరిమితం కాకుండా మరింత లాభదాయకమైన పంటలను పండించాలని కవిత సూచించారు. వ్యవసాయ శాఖను పటిష్టం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వానికి వెంటనే తెలియజేయాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు సూచించారు. స్పీకర్ పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసినప్పుడు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారని, అందుకే సీఎం కేసీఆర్ ఆయనను లక్ష్మీపుత్రుడని అంటారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కాళేశ్వరం నీరు
పంట పండించడానికి విత్తనాలు ఉంటే సరిపోదని, సాగునీరు, విద్యుత్, పంట కొనే వ్యవస్థ లాంటి అనేక సౌకర్యాలు ఉండాలని, ఇలా ప్రతి అంశం గురించి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ లో భాగంగా 432 చెరువులను బాగు చేసుకున్నామని చెప్పారు. దీంతో 21 అడుగుల లోపల ఉన్న భూగర్భ జలాలు, నేడు 16 అడుగులపైకి పెరిగాయన్నారు. చెరువుల మరమ్మతుతోపాటు చెక్డ్యాములను పెద్ద సంఖ్యలో నిర్మించుకున్నామని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ.60కోట్ల వ్యయంతో 22 చెక్డ్యాములను నిర్మించినట్లు తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ- 22తో ఈ ప్రాంతానికి లక్ష ఎకరాల సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత వారం లోనే రూ.850కోట్లు మంజూరు చేసిందని, త్వరలో కాలువల పనులు ప్రారంభమవుతాయని వివరించారు. సదాశివనగర్ మండలంలో తె లంగాణ రాకముందు కేవలం 9 సబ్ స్టేషన్లు ఉండ గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రూ.181కోట్లతో మరో 10 సబ్స్టేషన్లను నిర్మించినట్లు చెప్పారు. ఎల్లారెడ్డిలో 119 మంది రైతులు మరణిస్తే రూ.98 కోట్ల బీమా వచ్చిందన్నారు.
వ్యవసాయాన్ని పండుగలా చేసిన కేసీఆర్
సమైక్యపాలనలో వ్యవసాయం దండగ అన్నారని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పండుగలా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారన్నారు. ఎరువుల కోసం గతంలో రైతులు చెప్పులను క్యూలో పెట్టి వారం రోజులపాటు అక్కడే ఉండేవారని అన్నారు. స్వరాష్ట్రంలో రైతులకు ఎప్పడు కావాలంటే అప్పుడు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి మండలాల్లో మక్కజొన్న పంటను ఎక్కువగా పండిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కలను కొనుగోలు చేస్తున్నదన్నారు. తెలంగాణ రైతులు ఆత్మాభిమానం కలిగిన వారన్నారు. అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, స్పీకర్ పోచారం, ఎమ్మెల్యే సురేందర్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ శోభ తదితరులు సహపంక్తి భోజనాలు చేశారు.
-ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఉచిత విద్యుత్ ఏ రాష్ట్రంలోనూ లేదు : సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వడంలేదని, తెలంగాణ మాత్రమే ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, మీటర్లు పెట్టి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని తెలిపారు. రైతులు సాగుచేసిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నదని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు. కోటీశ్వరుడైనా, పేదవారైనా రైతులు పండించిన ధాన్యాన్ని తింటేనే ఆకలి తీరుతుందని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు అవసరమైన వాటిని సమకూర్చారని తెలిపారు. 2014లో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7వేల మెగావాట్లు అయితే నేడు 18వేల మెగావాట్లకు పెరిగిందన్నారు. దేశంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తును వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, పక్కనే ఉన్న మహారాష్ట్రలో 6 గంటలు, కర్ణాటకలో 7 గంటల విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. సాగునీటి విడుదల కోసం గతంలో ధర్నాలు చేసేవాళ్లమని, లాఠీదెబ్బలు తిన్నామని గుర్తుచేశారు. నేడు రెండు పంటలకు ఢోకా లేకుండా పుష్కలంగా సాగునీరు అందుతున్నదన్నారు. మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల్లో ముఖ్యమంత్రి సీటు కోసం పది పన్నెండు మంది కొట్లాడుకుంటున్నారని, వారికి రాష్ట్ర అభివృద్ధి పట్టదని ఎద్దేవా చేశారు.
పైసాఖర్చు లేకుండా 5 లక్షలు ఇచ్చిండ్రు
నా భర్త చాకలి నడ్పి మల్లయ్య మృతిచెందడంతో సర్కార్ వారం రోజుల్లో రూ. 5 లక్షలు మా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. వ్యవసాయ అధికారులకు పట్టా పాసు పుస్తకం, రైతు బీమా పత్రం, బ్యాంక్ ఖాతా ఇచ్చిన వారం రోజులకే బీమ డబ్బులను ప్రభుత్వం జమచేసింది. అప్పులు కట్టి మిగితా డబ్బులతో ఇల్లు కట్టుకున్న. కేసీఆర్ సార్ లేకుంటే మా కుటుంబానికి దిక్కెవరు. ఆ సారు చల్లంగా ఉండాలే.
-చాకలి సంగవ్వ, తిమ్మోజివాడి