ఖలీల్వాడి, ఫిబ్రవరి 16: జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన వెబినార్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. హైదరాబాద్తో పాటు టైర్ టూ నగరాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు లాండ్ బ్యాంకు అందుబాటులో ఉండడంతోపాటు ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు అందిస్తోందని పేర్కొన్నారు. నిజామాబాద్లో ఐటీ హబ్ పనులు చివ రి దశకు చేరుకున్నాయని తెలిపారు. జిల్లాలో ఐటీ విద్యను అందించే విద్యా సంస్థలతోపాటు కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయని తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యార్థులతోపాటు డిప్లొమా విద్యార్థులకు సైతం మెరుగైన అవకాశాలు కల్పించాలని సూచించారు. బీఆర్ఎస్ ఎన్నారై కో -ఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ.. వివిధ దేశాల ప్రతినిధులకు స్వాగతం పలికి యువతకు ఐటీ ఉద్యోగాలు అందించడమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. అనేక దేశాలను తిరిగి ఇక్కడ ఐటీ హబ్లో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్మెంట్ సీఈవో విజయ్ రంగినేని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనువైన వాతావరణంలో ఐటీ హబ్ ను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఐటీహబ్ అనుమతులపై అప్లికేషన్ ప్రాసెస్ను వివరించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మాట్లాడుతూ.. జిల్లాకు నాల్గు వేల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. జిల్లాకు చెందిన చాలా మంది ఇతర దేశం, రాష్ర్టాల్లో పని చేస్తున్నారని తెలిపారు. ఐటీ హబ్ ఏర్పాటుతో ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు.