బోధన్ పట్టణం పూలసింగిడిగా మారింది. భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుక జనజాతరను తలపించింది. మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ విశిష్టతను వివరిస్తూ సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
బోధన్, అక్టోబర్ 18: భారత జాగృతి బుధవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలతో బోధన్ పట్టణం పూలవనంలా మారిపోయింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన వేడుకలతో పట్టణం సందడిగా మారింది. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో సాయంత్రం 6 నుంచి బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. పట్టణంలోని పుట్టపర్తి సాయిబాబా గుడి నుంచి వేలాదిమందితో ప్రారంభమైన బతుకమ్మల శోభాయాత్ర బస్స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో కళాశాల మైదానం బతుకమ్మలు, మహిళలతో కిటకిటలాడింది. శోభాయాత్రలో కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా పాల్గొన్నారు. అనంతరం కవిత ఆధ్వర్యంలో బృందాలుగా మహిళలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ మార్మోగింది. కవిత ప్రతి బృందంతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ కళాకారిణి తేలు విజయ బృందం పాటలకు మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడగా, ఎమ్మెల్యే సతీమణి ఆయేషా హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొనడం ఆకట్టుకున్నది. ఎమ్మెల్యే షకీల్ కూడా కొంతసేపు బతుకమ్మ ఆడి సందడి చేశారు.
బతుకమ్మ సంస్కృతి ఎంతో గొప్పదని, ఇలాంటి సంస్కృతిని చిరకాలం నిలుపుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉన్నదని భారత జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె మాట్లాడారు. చిన్న పిల్లలు ఇప్పటినుంచే బతుకమ్మ పాటలు, ఆటలు నేర్చుకోవాలని, తద్వారా మరో వందేండ్ల వరకు కూడా మన సంస్కృతి నిలబడుతుందని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ముస్లిం అయినప్పటికీ, బతుకమ్మ సంబురాలను ఇంత గొప్పగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా బతుకమ్మలను పేర్చడమే కాకుండా, బతుకమ్మ ఆడడం గొప్ప విషయమని అన్నారు.
భారత జాగృతి బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుచోట్ల స్థానిక మహిళలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మలను పేర్చారు. ఏకచక్రేశ్వర నగర్లోని బీఆర్ఎస్ నాయకుడు గుమ్ముల అశోక్రెడ్డి, ఉద్మీర్గల్లీలోని మాసూల్ శ్రీనివాస్, వినాయక్నగర్లోని కౌన్సిలర్ కామేపల్లి నాగరవర్ధినీ సత్యం, అనంతరం రాకాసీపేట్లోని తోకల గంగారెడ్డి, ప్రభుత్వ దవాఖాన ప్రాంతంలోని కొండ్ర పద్మా వెంకటి ఇండ్ల వద్ద బతుకమ్మలను పేర్చారు. పలువురు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల వద్ద ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమాతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. వేడుకల్లో ఎమ్మెల్యే షకీల్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహైల్, జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, బోధన్ నియోజకవర్గం కన్వీనర్ గట్టు హరికృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.