నిజామాబాద్, డిసెంబర్ 1, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కల్వకుంట్ల కవిత రాజకీయ అరంగేట్రమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంతో మొదలైంది. రాజకీయ పదవుల్లోకి రాకముందే స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తీవ్రంగా శ్రమించారు. తండ్రి కేసీఆర్ బాటలో నడిచి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఉద్యమ పార్టీకి అనుబంధంగా సాంస్కృతిక వారధిగా జాగృతి సంస్థను స్థాపించి మహిళా లోకాన్ని ఏకం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూనే ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ప్రతి ఉద్యమ ఘట్టంలో వీరోచితంగా పోరాటం చేశారు. అలా మొదలైన కవిత ప్రస్థానం అప్రతిహ తంగా సాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిజామాబాద్ జిల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్ వేదికగా గొంతెత్తారు. ఎన్నో అంశాలపై అనర్గళ ప్రసంగాలు ఇచ్చి దేశ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందారు. నరనరాన ఉద్యమ స్ఫూర్తిని నింపుకున్న కవిత దశాబ్దన్నర కాలంలో ఉద్యమ సమయంలో అనేక కేసులను ఎదుర్కొన్నారు. ధర్నాలు చేశారు. రాస్తారోకోలకు దిగారు. శాంతియుతమైన పద్ధతుల్లో నిరసనల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జై కొట్టి నడిచారు. అలాంటి వ్యక్తిపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కుటిల నీతికి పాల్పడుతోంది. కుట్రపూరితంగా పేర్లను చేర్చి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుండడంపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దుమ్మెత్తి పోస్తున్నది.
రాజకీయ కక్ష…
ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీల మధ్య వైరం సహజమే. అదీ ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో ప్రజల మద్దతును స్వీకరించే రూపంలోనే ఉండాలి. అంతే కానీ వ్యక్తిగత కక్షతో వేధింపులకు గురి చేయడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివిధ పక్షాలను లొంగదీసుకునే చర్యలకు పాల్పడడం హేతుబద్ధమైనది కాదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేండ్లుగా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోయడం, ఇతర పార్టీ నాయకులపై చట్టబద్ధ సంస్థలతో దాడులకు ఉసిగొల్పడం, భయభ్రాంతులకు గురి చేసి తమదే నెగ్గాలన్న రీతిలో బెదిరింపు రాజకీయాలతో పబ్బం గడుపుతోంది. మొన్నటి వరకు ఉత్తర, ఈశాన్య భారతంలో కనిపించిన ఈ జుగుప్సాకరమైన రాజకీయం ఇప్పుడు మోదీ, అమిత్ షా ఆదేశాలతో తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. లేనిపోని ఆరోపణలను సృష్టించి లీకుల ద్వారా అసత్య ప్రచారాలను చేయించి నీచ రాజకీయానికి పాల్పడుతోంది. అందులో భాగంగా ఎమ్మెల్సీ కవితపై కొంత కాలంగా విచక్షణ మరిచి హేయమైన చర్యలకు పాల్పడుతూ పైశాచికత్వాన్ని పొందుతోంది.
దీటుగా కవిత సమాధానం…
మలి దశ ఉద్యమంలో సమైక్య వాదుల కుట్రలను చీల్చిచెండాడిన కవిత ఇప్పుడు బీజేపీ తీరును అదే స్థాయిలో ఎండగడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా, మీడియా ద్వారా తనదైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న కుట్రలను ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో తిప్పి కొడుతున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరును బట్టబయలు చేస్తూ దీటైన సమాధానం ఇచ్చారు. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీ నాయకుల్లో గుబులు రేపింది.
బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని తెలిసిన తర్వాత ఎలాగైనా పైచేయి సాధించాలనే కుట్రతో అనైతికంగా ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడు తరహాలోనే కాషాయ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సైతం తెలంగాణ సమాజం సిద్ధమవుతున్నది. కుట్రపూరిత చర్యలను నిరసిస్తూ గురువారం హైదరాబాద్లోని కవిత నివాసానికి వందలాదిగా టీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై దీటుగా సమాధానం ఇచ్చి ఉద్యమ కాలం నాటి పరిస్థితులను మరోసారి కళ్లకు కట్టారు. సమైక్యవాదులను ఆనాడు దీటుగా ఎదుర్కొన్న కవిత ఇప్పుడు బీజేపీ చేస్తోన్న నీచ రాజకీయాలను అదే స్థాయిలో తిప్పి కొట్టేందుకు సిద్ధమవ్వడంపై ప్రజల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్తో బీజేపీలో వణుకు
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీని గడగడలాడించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ స్థాపనను జీర్ణించుకోలేని బీజేపీ చౌకబారు రాజకీయాలకు తెర తీసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసి ప్రజల ముందు ఉంచినందుకే తమపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని నిప్పులు చెరిగారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో తొమ్మిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారుల్లో కాషాయ పార్టీ అధికారం చేపట్టిందని చెప్పారు. ఆయా రాష్ర్టాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోదీ వచ్చే ముందు ఈడీ పోవడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నందునే మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని స్పష్టం చేశారు.
తన మీద కావచ్చు… మంత్రులు, ఎమ్మెల్యేల మీద కావచ్చు… ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం అన్నది బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ తప్ప ఇందులో ఏమీ లేదన్నారు. మంచి పేరును చెడగొట్టేందుకు లీకులు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొడతారన్నారు. ప్రధాని మోదీ తన రాజకీయ పంథాను మార్చుకోవాలని ఈ సందర్భంగా కవిత సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు ఏం చేస్తారో చెప్పుకుని ఎన్నికల్లో గెలవాలని, ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే కుదరదంటూ హితవు పలికారు. చైతన్యం కలిగిన తెలంగాణలో ఇలాంటివి చెల్లుబాటు కావన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రగతి పథంలో నడుస్తోందని అటువంటి సర్కారును పడగొట్టడానికి చేసిన కుట్రలను ప్రజలు గమనించారని తెలిపారు. ఆ కుట్రను ప్రజల ముందు పెట్టినందుకే తనపైనే కాకుండా తమ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.