నిజామాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గల్ఫ్, బీడీ కార్మికులు సహా అన్నివర్గాల సంక్షేమానికే సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. నిజాలే ప్రచారం చేయడం బీఆర్ఎస్ లక్షణమని పేర్కొన్నారు. కాంగ్రెస్లా అబద్ధాలు చెప్పడం, బీజేపీలాగా పథకాలను కాపీ కొట్టడం, పేర్లు మార్చి చెప్పుకోవడం తమకు రాదన్నారు. మరోసారి తప్పకుండా అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఉన్నదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కవిత స్థానిక క్యాంప్ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామన్న విశ్వాసం ఉన్నదని స్పష్టం చేశారు. ఒక్కోవర్గం సీఎం కేసీఆర్కు దగ్గరవుతూ వచ్చిందే తప్ప, ఏ ఒక్కరూ దూరం కాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించడం లేదని, అందుకే వారు అన్నివర్గాలకు దూరం అవుతున్నాయన్నారు. మూడు గంటల కరెంట్ ఇవ్వాలని, రైతుబంధు ఆపాలని అంటున్న కాంగ్రెస్ రైతులకు దూరమైందన్నారు. తమ మ్యానిఫెస్టో ఎంత అద్భుతంగా ఉన్నదో ఎన్నికల ఫలితాలే నిరూపిస్తాయని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను తాము కాపీ కొట్టామని అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని చెప్పారు.
కోరుట్లలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎంపీ అర్వింద్ను తప్పకుండా ఓడిస్తామని పునరుద్ఘాటించారు. తమ కార్యకర్తలు అర్వింద్ను ఓడించడానికి భీష్మించుకొని పనిచేయబోతున్నారన్నారు. అర్వింద్పై తనకన్నా ఎక్కువ తమ పార్టీ కార్యకర్తలే కోపంగా ఉన్నారని, వందకు 150శాతం ఓడగొడతామని, ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కోరుట్లకే కాకుండా మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అర్వింద్ చేసిందేమీ లేదన్నారు. అసలు ఇక్కడ బీజేపీ స్థాయి లేదని, ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. తెలంగాణకు బీజేపీ అడుగడుగునా అన్యాయం చేసిందన్నారు.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. మండల్ కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయలేదని గుర్తుచేశారు. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చేసినంత ఎవరూ చేయలేదని, అందుకే ఇదీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని, బీసీల ప్రభుత్వమని చెప్పుకుంటామని వివరించారు.
కేసీఆర్తోనే రాజకీయ సుస్థిరత..
పదేండ్లలో తెలంగాణ వేగంగా ఎదగడానికి కారణం రాజకీయ సుస్థిరత అని, రాష్ర్టాన్ని బీఆర్ఎస్ రాజకీయంగా సుస్థిరంగా ఉంచిందన్నారు. శాంతి భద్రతల సమస్యలు లేకుండా స్థిరమైన పాలనను అందించడంతోనే ఐటీ రంగానికి హబ్గా ఉన్న బెంగళూర్ను తలదన్ని మనం ఐటీ పరిశ్రమలు తెచ్చుకోగలుగుతున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాతోపాటు అనేక జిల్లాల్లో ఐటీ హబ్లు ఏర్పాటవుతాయని ఎవరూ అనుకోలేదన్నారు. భవిష్యత్తులో పారిశ్రామిక హబ్లు కూడా వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.
కామారెడ్డిలో కేసీఆర్పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. సీఎం కేసీఆర్ను రాష్ట్ర వ్యాప్తంగా తిరగనీయకుండా కేవలం పోటీ చేస్తున్న నియోజకవర్గానికి పరిమితం చేయాలని భావించి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారంటే అది అమాయకత్వమే అవుతుందన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు ఉమ్మడి నిజా మాబాద్ జిల్లాకు చాలా ఉపయోగపడుతుందన్నారు. అభివృద్ధిలో మలుపు తిప్పు తుందన్నారు. సీఎం కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో తమ పార్టీ చాలా ముందున్నదన్నారు. ఓట్లను చీల్చకుండా కేసీఆర్ వైపు నిలబడితే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పారిపోయి నిజామాబాద్కు వస్తున్నారని, ఆయన ముఖం చూసి కాకుండా పార్టీలను చూసి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. మైనార్టీల అభివృద్ధికి ఏమీ చేయలేదన్నా రు. సీఎం కేసీఆర్ను బలపర్చాలని మైనార్టీ వర్గాలకు కవిత పిలుపునిచ్చారు.