సమాజ హితం కోసం కలాన్ని విదల్చడమే కాదు.. జూలూ విదల్చాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. బుధవారం నగరంలో జరిగిన హరిదా రచయితల సంఘం మహాసభలో ఆమె మాట్లాడారు.
– ఖలీల్వాడి, మే 31
ఖలీల్వాడి, మే 31 : సమాజ హితం కోసం కలాన్ని విదల్చడమే కాదు.. జూలు కూడా విదల్చాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రచయితలకు పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. సున్నితత్వం, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తరిమికొట్టాల్సిన అవసరముందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన హరిదా రచయితల సంఘం 5వ మహాసభలకు స్థానిక ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు తదితరులతో కలిసి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలను ఆమె ఘనంగా సత్కరించారు.
జైలులో దాశరథి విగ్రహం..
అనంతరం కవిత మాట్లాడుతూ.. దాశరథి, వట్టికోట అళ్వారుస్వామిని నిజాంకాలంలో ఇందూరు జైలులో బంధించారని, ఆ జైలు గోడ మీద దాశరథి బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మాట యావత్తు తెలంగాణ ఉద్యమానికి బాట చూపించిందని స్పష్టంచేశారు. ఆ జైలు గోడను తన ఎమ్మెల్సీ ఫండ్ నుంచి రూ.40 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసి, కొత్తతరానికి దాని ప్రాముఖ్యత తెలియజేప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జూలై 22న దాశరథి జయంతి సందర్భంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మానవత్వాన్నే కోల్పోయాం..
ఢిల్లీ నగర నడిబొడ్డున ఒక ఆడపిల్లను కత్తితో పొడిచి, బండరాయితో తలపై మోది చంపేస్తుంటే చుట్టూ ఉన్న వాళ్లు ఫోన్లలో చిత్రీకరించారు కానీ ఎవరూ ఆపిన పాపాన పోలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎటు నుంచి ఎటు పయనిస్తున్నామన్నది మనం ఆలోచించుకోవాలన్నారు. దరిద్రపు సెల్ఫోన్ అనేది చేతికి, మనిషికి ఎక్స్టెన్షన్లా తయారై సున్నితత్వం లేని విధంగా మనుషులు తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇవాళ్ల రకరకాల అంశాలు ఇంటిదాకా వస్తున్నాయి. మన నోటును కొల్లగొట్టడానికి, మన ఓటును కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలు సరే.. కానీ మన సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తప్పకుండా తరిమికొట్టాల్సిందేనని’ కవిత పిలుపునిచ్చారు.
రకరకాల జాఢ్యాలకు సాహిత్యంతోనే అడ్డుకట్ట
ఒక పుస్తకాన్ని చదువుతుంటే మన జీవితాన్ని మనం అనుభవిస్తున్నట్లుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కానీ సినిమాలు అలా ఉండవని, చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఆలోచింపజేసేలా ఉంటాయని చెప్పారు. లుక్ కల్చరా లేదా బుక్ కల్చరా? అంటే తనదైతే బుక్ కల్చరేనని స్పష్టంచేశారు. పుస్తక సంస్కృతిలోకి మనం పిల్లలను లాగాల్సిందేనన్నారు. లేకపోతే ఘోరాన్ని చూసి మనం స్పందించే గుణాన్ని ఏదైతే కోల్పోయామో.. అలా భవిష్యత్తులో ఇంకా దారుణాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రపంచీకరణ జరిగిన తర్వాత మన ఫోన్లకు రకరకాల జాఢ్యాలు వచ్చాయని, అవి పెరిగి పెచ్చురిల్లుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు. అది సాహిత్యంతోనే జరుగుతుందన్న విశ్వాసం తనకు ఉందని, మనిషి సమాజపు ఆలోచనను మార్చే శక్తి ఒక చిన్న సిరా చుక్కకు ఉందని వ్యాఖ్యానించారు. హిందీ భాషలో రాసే కవులను కూడా కూడగట్టి.. దేశంలో వస్తున్న నిర్లిప్తత ఏమిటి, సంస్కృతి ఏమిటి అన్న అంశాలపై రాయాలని ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
ప్రజల బాగోగులే ముఖ్యం…
ప్రజల బాగోగులే ముఖ్యమని కవిత అన్నారు. 2009లో ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుంటే పార్టీలు లేవు, ఏమీ లేవు అని అన్న సీఎం కేసీఆర్ అప్పటి మంత్రి జానారెడ్డికి ఇంటికి వెళ్లి ప్రొఫెసర్ కోదండరామ్ను పిలిపించి జేఏసీ ఏర్పాటు చేయించారని కవిత గుర్తుచేశారు. పార్టీలు కాదు, మనకు తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. అది తెలంగాణ అయినా, దేశం అయినా రాజకీయం ఏమీ లేదని, ప్రజల బాగోగుల కోసం మాత్రమే చేసిన ఆలోచన అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా హరిదా కార్యకలాపాలు విస్తరించాలన్నారు. టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్మన్ ఆకుల లలిత, మహిళా కమిషన్ మెంబర్ సూదం లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, కవులు, రచయితలు పాల్గొన్నారు.
నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్ నివాసానికి ఎమ్మెల్సీ కవిత బుధవారం వెళ్లారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రదీప్తో మాట్లాడి మలిదశ తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ అనే కుటుంబానికి తెలంగాణలోని ప్రతిఒక్కరూ ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొని కుటుంబ సభ్యులవలె సహకరించారని, వారి కుటుంబాలను కలవడం తమ బాధ్యత అని కవిత అన్నారు.
– నిజామాబాద్ లీగల్, మే 31