ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. ఎవరినీ వదలడం లేదు. ఏ రంగాన్నీ విడిచి పెట్టడం లేదు. కార్పొరేట్ పెద్దలకు కార్పెట్లు పరిచే కేంద్ర ప్రభుత్వం.. పేదలను మాత్రం ‘పన్ను’పోట్లతో చావగొడుతున్నది. పాల నుంచి మొదలుకుని అన్నింటిపైనా జీఎస్టీ విధిస్తూ సామాన్యుల జీవితాలను ఆర్థిక కల్లోలం లోనికి నెడుతున్నది. తాజాగా చేనేత రంగంపైనా జీఎస్టీ విధించింది. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారు. బీమా సౌకర్యంతో పాటు నేతన్నలకు పింఛన్ కూడా అందిస్తున్నారు. మరోవైపు, మోదీ ప్రభుత్వమేమో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు తెర లేపింది. కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ జీఎస్టీని విధించింది. దీనిపై ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీని రద్దు చేయాలని రాష్ట్రంలో పోస్టుకార్డు ఉద్యమం కొనసాగుతున్నది. ఇప్పటికే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మోదీకి లేఖాస్ర్తాలను సంధించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని నేతన్నలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సామాన్యులు పోస్టుకార్డు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పెంపుదల నిర్ణయం చేనేత, జౌళి రంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. మరో ఏడు శాతం పెరిగితే ఉత్పతుల ధరలు పెరిగి వస్ర్తాల క్రయ, విక్రయాలు గణనీయంగా తగ్గుతాయని, ఈ ప్రభావం చేనేతపై ఆధారపడిన వేలాదిమంది కార్మికులకు ఉపాధిని దూరం చేస్తుందనే ఆందోళనను కార్మిక, వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కష్టాలతో కునారిల్లుతోన్న ఈ రంగానికి మరణ శాసనం రాస్తుందనే అభిప్రాయాన్ని చేనేత సహకార సంఘాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా చేనేతపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా అమలు చేస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖాస్ర్తాలు సంధిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మొదలు పెట్టిన ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ప్రజా ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజలు పోస్టు కార్డు రాస్తూ ప్రధానికి పంపుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం ఇప్పటికే లేఖాస్త్రం సంధించగా ఇదే బాటలో మిగిలిన వారు పయనించబోతున్నారు. లేఖాస్త్రంతో బీజేపీలో కలవరపాటు మొదలైంది. చేనేత వర్గానికి చెందిన వారంతా బీజేపీ నీచ రాజకీయంపై దుమ్మెత్తి పోస్తూ నిరసనలో పాల్గొంటుండడం విశేషం.
చేనేతపై మోదీ ప్రతాపం…
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్ర్తాలపై జనవరి 1, 2022 నుంచి జీఎస్టీని 5 శాతం నుంచి 12శాతానికి పెంచేందుకు పన్నాగాన్ని రచించింది. తీవ్ర స్థాయిలో నిరసన రావడంతో పెంపును తాత్కాలికంగా పక్కన పెట్టి అదును కోసం ఎదురు చూస్తున్నది. ఏదో ఒక సందర్భంలో 12శాతం జీఎస్టీని చేనేత రంగంపై విధించేందుకు మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత వ్యూహాలు రచిస్తోంది. ఈ చర్యలపై నేతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చేనేత రంగం గడ్డు పరిస్థితిలో ఉండగా తాజా చర్యలు పెనం పైనుంచి పొయ్యిలో పడే పరిస్థితి తెస్తుందని ఆ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెంచితే వినియోగదారులు వెనక్కి తగ్గుతారని పెంచకుంటే ఆ భారం సంఘాలు మోయాల్సి వస్తుందని వాపోతున్నారు. జీఎస్టీ అమల్లోకి రాకముందు దేశ వ్యాప్తంగా వస్ర్తాలపై సింగిల్ పాయింట్ పన్ను ఉండేది. పన్ను చెల్లించాక ఎన్ని లావాదేవీలు నిర్వహించినా అదనపు పన్ను ఉండకపోయేది. విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అమల్లోకి వచ్చాక 5శాతం పన్ను విధించారు. తర్వాత కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అది ఎత్తేశారు.
పేద వర్గాలపై బీజేపీ కుట్ర…
కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్ల క్రితం జీఎస్టీని అమల్లోకి తీసుకు రావడంతో మళ్లీ 5 శాతం పన్ను అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు ఇది 12శాతానికి చేరబోతున్నది. రెడీమేడ్ వస్ర్తాల కారణంగా ఇప్పటికే చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో జీఎస్టీని పెంచడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారనున్నది. ఉమ్మడి జిల్లాలో కొన్ని కుటుంబాలు నేటికీ చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరికి ఈ నిర్ణయం ఇబ్బందికి గురి చేయబోతున్నది. మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో వారంతా రోడ్డున పడే దుస్థితి ఏర్పడుతున్నది. చేనేత సహకార సంఘాల్లో తయారయ్యే వస్ర్తాలను వారి సంఘాల పేరుతో దుకాణాల్లో విక్రయిస్తుంటారు. జీఎస్టీ భారంతో కొనుగోళ్లు తగ్గితే సంఘాల్లో నిల్వలు పేరుకుపోయే ప్రమాదం ఉందని సంఘాల నాయకులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోనే చేనేత మగ్గాలకు అంతగా ప్రసిద్ధి లేకపోయినప్పటికీ 44 కుటుంబాలను ఈ నిర్ణయం వేధిస్తున్నది. ప్రత్యక్షంగా ఆయా నేత కార్మిక కుటుంబాలపై ప్రభావం తక్కువే అయినప్పటికీ చేనేత వస్ర్తాలను విక్రయించే అనేక మందిపై పెను భారం తప్పదన్నట్లుగా మారబోతున్నది.
కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఉద్యమం…
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక ఆకర్షణీయ పథకాలను, రాయితీతో కూడిన యూనిట్లను మంజూరు చేసింది. మరోవైపు చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని సైతం కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే చేనేత కార్మికులకు పింఛన్ సైతం అందుతున్నది. ఉభయ జిల్లాల్లో వందలాది మంది కేసీఆర్ సర్కారు అందిస్తున్న పింఛన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇలా నేత వర్గాన్ని తెలంగాణ సర్కారు ప్రోత్సహిస్తుంటే మోదీ సర్కారు మాత్రం కక్షపూరితంగా ఆ వర్గాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నది. కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ సామాన్య కుటుంబాలపై బీజేపీ ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుండడంపై సర్వత్రా వ్యతిరేకత వస్తున్నది.
ఇందులో భాగంగా చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించిన నిరసన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కేటీఆర్ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా లేఖాస్ర్తాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంధిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం ఇప్పటికే లేఖలు రాయగా ఇదే బాటలో ప్రజా ప్రతినిధులు సైతం పయనించబోతున్నారు. చేనేత కుటుంబాలు సైతం పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి.
మోదీ కర్కశత్వానికి నిదర్శనం
చేనేతపై జీఎస్టీ పెంపుతో సామాన్యులపైనా ప్రభావం పడుతుంది. ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారితోపాటు పరోక్షంగా వస్ర్తాల ధరల పెరుగుదలతో కోట్లాది మందిని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇది అంతిమంగా వస్త్ర వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇదీ ఒకటి. బీజేపీ కర్కశత్వానికి చేనేతపై జీఎస్టీ విధింపు ఉదాహరణగా నిలుస్తున్నది.
– చింతా మహేశ్, పద్మశాలి యువజన సంఘం
జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి…
చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరిస్తూ లక్షలాది మంది పొట్ట కొట్టేలా జీఎస్టీ విధిస్తున్నది. చేనేత వస్త్ర రంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వమే దెబ్బ తీసే విధంగా యత్నించడం తగదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. లేదంటే చేనేత కార్మికుల ఉసురు తగులుతుంది.
– మురళి, పద్మశాలి సంఘం, ప్రధాన కార్యదర్శి