ఖలీల్వాడి, నవంబర్ 22 : రేవంత్ బెదిరింపులకు భయపడేవాళ్లెవరూ ఇక్కడ లేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్, కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కవిత తీవ్రంగా ఖండించారు. బుధవారం నిజామాబాద్లోని క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలకు ఐటీ రంగాన్ని విస్తరించించిందని.. కానీ కాంగ్రెస్ అల్లర్లను విస్తరిస్తూ వచ్చిందని మండిపడ్డారు. తమ పార్టీ బోధన్ అభ్యర్థి షకీల్పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని, జిల్లాకు వచ్చిన రేవంత్రెడ్డి కొంత బాధ్యతగా మాట్లాడుతారని అంతా అనుకున్నారని కానీ ఉల్టా పోలీసులను విమర్శిస్తున్నారని వివరించారు. ఇలా రౌడీయిజం, గుండాయిజాన్ని ప్రోత్సహించే వాళ్లకు పట్టం కట్టవద్దని, వారికి ఎక్కడికక్కడ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. తాము అభివృద్ధి వైపు వెళ్తుంటే వాళ్లు అరాచకం వైపు వెళ్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్నదని, దాన్ని జీర్ణం చేసుకోలేక తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై భౌతిక దాడికి దిగడం చాలా హేయమైన అంశమన్నారు. రౌడీల్లా, వీధి గుండాల్లా కాపుకాసి మాటు వేసి తమ అభ్యర్థులపై దాడి చేయడం దారుణమని ఖండించారు. మొన్న దుబ్బాకలో, నిన్న మంథనిలో ఈ రోజు బోధన్లో జరిగిందని, కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం, సంస్కృతి బయట పడుతున్నదని తెలిపారు. బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పాలని, కానీ ఇలా గుండాయిజం, రౌడీయిజం చేయడం ఎందుకని ప్రశ్నించారు.
అభద్రతాభావంతో ఉన్నారని ఆరోపించారు. ప్రజల మనసు గెలుచుకొని సీట్లు తెచ్చుకోలేక తమ అభ్యర్థిపై దాడి చేస్తే వచ్చేదేమిటని అడిగారు. పదేండ్ల కాలంలో చిన్న మతకల్లోలం లేకుండా, రౌడీలు, గుండాలు లేకుండా పరిపాలన సాగిస్తున్న సందర్భంగా రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పారు. ఆ పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. యువతను పకోడీలు వేసుకోవాలని బీజేపీ పార్టీ అంటుందని, కాంగ్రెస్ పార్టీ యువతను అరాచకం వైపు తీసుకెళ్తుందని విమర్శించారు. జిల్లాలో గత ఎన్నిల్లో బీసీలకు ఇచ్చిన టికెట్లను ఈ సారి ఇతరులకు ఇచ్చి తమ పార్టీ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్పై మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్గా ఉన్న సమయంలోనే ఆ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేశామని, ఉల్టా ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం చేసినట్లు రేవంత్రెడ్డి మాట్లాడడం తగదని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీని చూపించి ఓట్లు అడుగుతాం.. బీఆర్ఎస్ ఏం చూపించి ఓట్లు అడుగుతుందని రేవంత్రెడ్డి అన్నారని జిల్లాకు వచ్చి రేవంత్రెడ్డి చూడాలని, గతంలో కన్నా 3 రెట్ల ఆయకట్టు పెరిగిందని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టును జవహర్లాల్ నెహ్రూ మొదలుపెడితే తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పూర్తి చేశారని వివరించారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తున్నదని సీఎం కేసీఆర్ అని కావున ఎస్సారెస్పీ గురించి మాట్లాడే అధికారం హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మేయర్ దండు నీతూకిరణ్, సీనియర్ నాయకుల అలీం, రాజారాం యాదవ్, మధు, ఖుద్దూస్ పాల్గొన్నారు.