ఖలీల్వాడి, నవంబర్ 27 : నిజామాబాద్లో ఉన్నామా లేదా హైదరాబాద్లో ఉన్నామా అనుకునేంత స్థాయిలో నిజామాబాద్ను అభివృద్ధి చేసి, అద్భుతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతోపాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుబంధు పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటబడి మరీ నిలిపి వేయించిందని, రైతుల నోటి కాడి బుక్కను లాక్కొని మరోసారి ఆ పార్టీ రైతు వ్యతిరేకతను చాటుకున్నదని అన్నారు. రైతుబంధు ఇప్పటికే అమలులో ఉన్న పథకమని, 10 సార్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసిందని తెలిపారు. రైతుబంధు పథకం ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకుండా సీఎం కేసీఆర్ అమలుచేశారని గుర్తుచేశారు. రైతు వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకున్నదని అన్నారు. ఆ పార్టీకి రైతులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఐదారు రోజులుగా ప్రధాని మోదీతోపాటు ఇతర రాష్ర్టాల సీఎంలు, కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రచారం చేస్తున్నారని, పంటలు చేతికొచ్చే సమయంలో మిడతల దండులాగా తెలంగాణ మీద పడడానికి వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాడు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. మానవీయ కోణంతో ఆలోచించే సీఎం కేసీఆర్పై అభాండాలు వేస్తూ, పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్న మిడతల దండు పనిపట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు.
బుల్డోజర్లు కాదు..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చి తెలంగాణలో బుల్డోజర్ నడపాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారని, వెయ్యి బుల్డోజర్లు నడిపినా వాటిపై దాడి చేయడానికి కారు సిద్ధంగా ఉందన్నారు. ‘బుల్డోజర్లు నడపడం మా ఆలోచన కాదు, పొలాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవాలన్నదే మా ఆలోచన. సాగు, తాగునీళ్లు అందించాలని, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని, మీలాగా ఇండ్లను కూల్చివేయడం కాకుండా ఇండ్లు నిర్మించడమే మా ఆలోచన’ అని వ్యాఖ్యానించారు. ఉపాధిహామీ కార్మికులకు సగటున రోజుకు రూ.150 వేతనం కూడా రావడం లేదని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరించడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ ఆరోపించారని, ఆమె మాటలు వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కానీ పరిస్థితి నెలకొన్నదన్నారు. తాడిచెటర్ల బొగ్గు గనిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. సింగరేణిని కూడా ఎంతో అభివృద్ధి చేశామని, సుమారు 25 వేల మందికి డిపెంటెంట్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలకు బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం లేదని, వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను యువత ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.