ఖలీల్వాడి, నవంబర్ 11: బీసీల సీట్లను కాంగ్రెస్ పార్టీ కోట్లకు అమ్ముకొని అగ్రవర్ణాలకు కట్టబెట్టిందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సీట్లు అమ్ముకొని రేవంత్రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధును రైతులకు వేస్తున్న భిక్షమంటూ రేవంత్రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ నాయకుల అహంకారానికి అడ్డూ అదుపు లేకుండా పోతున్నదని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తుంటే పొరపాటున అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతల పనులు ఎలా ఉంటాయో ఆలోచించాలని కోరారు. కామారెడ్డిలో ఖాళీ కుర్చీలనుద్దేశించి రేవంత్ ప్రసంగించారని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై కర్ణాటక ప్రజలు దుమ్మెతిపోస్తుంటే ఆ సీఎం ఇక్కడికొచ్చి ఏవేవో చెబుతున్నారని విమర్శించారు. నగరంలో ఆదివారం జరిగిన గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 8జనరల్ సీట్లకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నాలుగు స్థానాలు కేటాయించిందని, ఈసారి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని తెలిపారు. బీసీల సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకొని అగ్రవర్ణాలకు అప్పగించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జిల్లా బీసీలకు ఒక్క సీటూ ఇవ్వకుండా బీసీ డిక్లరేషన్ చేయడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. రేవంత్రెడ్డి కామారెడ్డికి వచ్చి కాలు దువ్వుతున్నారని, కేసీఆర్ సీఎం కాబట్టి రకరకాల వ్యూహాలతో రెండు చోట్లా పోటీచేస్తున్నారని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లగా ఈటల రాజేందర్, రేవంత్రెడ్డి రెండుచోట్లా పోటీకి దిగారని, వారికి వాతలే మిగులుతాయన్నారు. కర్ణాటక ప్రజలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య తెలంగాణకు వచ్చి బీసీలకు అవి చేస్తామని, ఇవి చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. కరెంట్, సాగు నీళ్లు లేక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలవ్వడం లేదని అన్నారు. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో ఎవ్వరూ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కాలేదని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గోసంగి సామాజికవర్గానికి చెందిన వారందరికీ.. దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.
ఎన్నికల తర్వాత కటాఫ్ డేట్ను పొడిగించి బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారని కవిత స్పష్టంచేశారు. ఆసరా పింఛన్లు రానున్న ఐదేండ్లలో రూ.5వేలకు పెరుగుతాయన్నారు. పేదలపై భారాన్ని తగ్గించడానికి రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. యువకులకు జాబ్మేళాలు నిర్వహించామని, ఐటీ పరిశ్రమలను నిజామాబాద్కు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టంచేశారు. ఎన్నికలున్నా, లేకున్నా ప్రజల కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.