ఖలీల్వాడి, నవంబర్ 24 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు సూచించారు. జిల్లాకేంద్రంలోని 11వ డివిజన్లో ఉన్న 50 క్వార్టర్స్, పూజారి కాలనీ, బహుజన్ కాలనీ, అసద్ బాబానగర్, బాబన్సాబ్ పహాడ్లో బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాతో కలిసి శుక్రవారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాటు పాలన చేసి రాష్ట్రానికి ఏమీ చేయలేదని, ఆడపిల్లల కోసం ఒక్క పథకం గురించి కూడా ఆలోచన చేయలేదని అన్నారు. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని, ఆడబిడ్డ పెండ్లి కోసం కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,00,116 అందజేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉండగా.. తెలంగాణ వచ్చిన అనంతరం వాటి సంఖ్యను 22కు పెంచినట్లు తెలిపారు. బీసీలకు కూడా ఒక్కటే మైనార్టీ స్కూల్ ఉండేదని, ప్రస్తుతం 22 మైనార్టీ స్కూళ్లు నడుస్తున్నాయని వివరించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎక్కడా కర్ఫ్యూ విధించలేదని, రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేలు అందజేస్తామని అన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు నగరంలో ఐటీ హబ్ నిర్మించి 3500 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు.
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని నాగారం ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. నాగారం నుంచి నగరంలోకి బీటీ రోడ్లు నిర్మించామని, ప్రతి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. గతంలో నాగారం ప్రజలు నీటికోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. తాగునీటి పైపులైన్ నిర్మాణం చేసి నీటి సమస్యను తీర్చామన్నారు. బాబన్సాబ్పహాడ్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో అసెంబ్లీలో మాట్లాడి, నిధులు తెచ్చి, నూతన బ్రిడ్జి నిర్మిస్తున్నామని చెప్పారు. నాగారంలో సకల సదుపా యాలతో గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నామని, సీఎం కేసీఆర్ అమలు చేసే సంక్షేమ పథకాల్లో మానవీయ కోణం ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలను పక్కాగా అమలుచేస్తామన్నారు. తనను మరోసారి ఆశీర్వదించాలని, నగరాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు అర్హులకు సంక్షేమ పథకాలను అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్ బోడిగం కోమల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.