భీమ్గల్, మే 4: తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను మరిచిపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఆయన భీమ్గల్ మండలంలోని బెజ్జోర, పిప్రి గ్రామాల్లో నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన రోడ్షోలో వేముల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి ఐదునెలలైనా హామీలు అమలుకు నోచుకోవడంలేదన్నారు. ప్రజలను మభ్యపెడుతూ ఐదు నెలలు గడిపారన్నారు. ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కార్కు ఓటుతో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఏ ఒక్కరోజు కూడా ప్రజల మధ్యకురాని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఓట్ల కోసం మరోసారి రావడం సిగ్గుచేటన్నారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న ఆయన జిల్లాకు చేసిందేమీలేదన్నారు. ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, సొసైటీ చైర్మన్ నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.