బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత.. కాంగ్రెస్ అంటే అహంకారమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్లో బుధవారం నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బోధన్, నవంబర్ 8: బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాక ముందు ఆంధ్రా పాలకులు గౌడ కులస్తులను అవమానాలకు గురిచేస్తూ అరిగోస పెట్టారని, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి కూడా కల్లు సొసైటీలను పునరుద్ధరించకుండా గౌడ కులస్తుల గోస పుచ్చుకున్నాడని ఆరోపించారు. బోధన్ పట్టణంలోని కౌండిన్య గౌడ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో హరితహారంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఐదు ఎకరాల్లో ఈత వనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈత చెట్లపై పన్నును రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించామని తెలిపారు. అందరి మంచికోరే వ్యక్తి, ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేది కేసీఆరేనని పేర్కొన్నారు. కల్లు దుకాణాలకు అనుమతులిచ్చి 70వేల గౌడ కుటుంబాలకు ఉపాధి కల్పించామన్నారు.
గత ప్రభుత్వాలు గౌడలకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈతవనాల పెంపకానికి అదనంగా భూమిని కేటాయిస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే సుదర్శన్రెడ్డి బయటికి వస్తాడని, కానీ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటున్నాడని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉండడంతో పెద్దపెద్ద కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టాయని, దీంతో 30లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు వెల్లడించారు. పదేండ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో బీసీలకు రెండు రెసిడెన్షియల్ హాస్టళ్లు ఉంటే, ప్రస్తుతం 23 హాస్టళ్లను ఏర్పాటు చేశామన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి.. విద్యార్థి నాయకులను అడ్డమీద కూలీలుగా అభివర్ణించారని, రైతులకు బిచ్చం వేస్తున్నారని అహంకారపూరితంగా వ్యాఖ్యానించినట్లు కవిత తెలిపారు. తెలంగాణ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ గ్రామదేవతల ఆలయాలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గ్రామదేవతల ఆలయాల అభివృద్ధికి రూ.10లక్షలు ఇచ్చేలా కృషి చేశారన్నారు. మన కోసం పనిచేసే వ్యక్తులను ఎన్నికల సమయంలోనే గుర్తించవచ్చని, ఎన్నికల రోజు తప్పకుండా ఇండ్ల నుంచి బయటికి వచ్చి షకీల్కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గౌడ కులస్తులకు సీఎం కేసీఆర్ హయాంలోనే ఆత్మగౌరవం పెరిగిందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. సైకిల్పై సారా మోసే వ్యక్తి.. గౌడన్నలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించి గౌడన్నల పొట్టకొట్టారని ఆరోపించారు. కుల,మతాలకతీతంగా చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తాను మరోమారు విజయం సాధిస్తే బోధన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహంతోపాటు రూ. 50లక్షలతో గౌడ భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. బోధన్లో నెలకొన్న టీఎఫ్టీ, నాన్ టీఎఫ్టీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని అన్నారు.