ఆర్మూర్, అక్టోబర్ 3 : ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. నమస్తే నవనథపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 3వ వార్డు పరిధిలోని హౌసింగ్బోర్డ్, గణేశ్నగర్, విద్యానగర్ కాలనీల్లో ప్రజా ఆశీర్వాద యాత్రను మంగళవారం నిర్వహించారు. కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ…..ఆర్మూర్ అభివృద్ధిలో కాంగ్రెస్, బీజేపీల పాత్ర నయా పైసా లేదని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణం 2014కు ముందు ఎట్లుంది? ఇప్పుడెట్లుందని రూ.3వేల కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ,బీజేపీలకు ఓట్లు తప్ప జనం పాట్లు పట్టవని ధ్వజమోత్తారు. ఒక్క బీఆర్ఎస్సే తెలంగాణ మేలు కోరే పార్టీ అని , తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని ప్రజామద్దతుతో మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. ఉద్యమ చరిత్ర తప్ప రాజకీయ నేపథ్యం లేనోడినని మూడో సారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని జీవన్రెడ్డి కోరారు ఈ సందర్భంగా కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిటే
బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం నందిపేట మండల కేంద్రానికి చెందిన మాదిగ సంఘం సభ్యులు, కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు (గుండు సంఘం) సభ్యులు, డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామానికి చెందిన అంబేద్కర్ మాల సంఘం సభ్యులు తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకేనని తెలుపుతు జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జీవన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ…..ఓట్ల కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ దసరా వేషగాళ్ల మాయలో పడవద్దన్నారు. తెలంగాణలో మూడో సారి కేసీఆర్ సీఎం కాకుండా ఏ శక్తి ఆపలేదని , కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిట్ రావడం కష్టమేనన్నారు. ఆర్మూర్ అభివృద్ధిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ప్రజలంతా కలిసి తనను ఏకపక్ష విజయాన్ని అందించాలని జీవన్రెడ్డి కోరారు.