ఆర్మూర్, జూలై 31 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భా రం మోపుతూ దారుణంగా హింసిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మోదీ సర్కార్ చేసే పనులు నిల్… వేసే పన్నులు ఫుల్ అని ఎద్దేవా చేశారు. పిల్లలు తాగే పాలపైనా, టీ, కాఫీ పౌడర్లపైనా పన్ను వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆదివారం ఆయన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆర్మూర్లో విలేకరులతో మా ట్లాడారు. గతంలో వాజ్పేయి, అద్వానీ హయాం లో కిసాన్ మోర్చా, మహిళా మోర్చా వంటివి బీ జేపీకి అనుబంధంగా ఉండేవని, ఇప్పుడు అంబానీ మోర్చా, ఆదానీ మోర్చా, ఈడీ మెర్చా, ఐటీ మెర్చా, సీబీఐ మోర్చా బీజేపీకి అనుబంధ సంస్థలుగా మారాయని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మాట్లాడేవన్నీ అబద్ధాలే అని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను నిలువునా మో సం చేశారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అర్వింద్ ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ ఎంపీ అని విమర్శించారు. ఒక సైకో అని, డ్రగ్స్కు బానిసై నిత్యం మత్తులో ఉంటాడని ఆరోపించారు. మామిడిపల్లి రైల్వేవంతెన మంజూరు చేయిం చింది తాను అని, 2017 లో వంతెన మంజూరైనపుడు అర్వింద్ ఎంపీ కూడా కాదని గుర్తుచేశారు.
అర్వింద్ మం జూరు చేయించానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ‘పుట్టినోళ్లు మా వాళ్లే’ అనడం బీజేపీ నైజమన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి రూ. మూడు వేల కోట్లు తెచ్చానని, ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా ? అని, ధైర్యముంటే తనపై పోటీ చేసి గెలువాలని సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లాకు పట్టిన శని అని విమర్శించారు. పసుపు బోర్డు తేకుంటే వారం రోజుల్లో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అబద్ధాల కోరు అని మండిపడ్డారు. ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పి మాట తప్పాడని అన్నారు. ఇప్పటికే నిజామాబాద్ రూరల్, కోరుట్ల, బాల్కొండ, బోధన్ తదితర ప్రాంతాల్లో ప్రజలు అర్వింద్ను ఉరికిచ్చి కొట్టారని గుర్తుచేశారు. అర్వింద్ తండ్రి టీఆర్ఎస్ పెట్టిన భిక్షతోనే బతుకుతున్నారని ఘాటుగా విమర్శించారు. 40 ఏండ్లు రాజకీయాల్లో ఉన్నా అర్వింద్ను ఎవరూ గుర్తుపట్టరని అన్నారు. కొత్త బిచ్చగాడి మాదిరిగా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న అర్వింద్ను మెం టల్ దవాఖానలో చేర్పించాలని ఎద్దేవా చేశారు. ఆయన బతుకంతా అవినీతిమయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లలో కేంద్ర ప్రభుత్వ నిధుల్లో నుంచి నయాపైసా ఉందా అని ప్రశ్నించారు. మామిడిపల్లి వంతెనకు సంబంధించి అర్వింద్ అన్ని దొంగ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఎంపీకి చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు.
కేసీఆర్ను విమర్శిస్తే సహించేదిలేదు..
కేసీఆర్, కేటీఆర్, కవితను విమర్శిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీలకు అధికారం ఒక కలగానే మిగిలిపోతుందని, మరో 30 ఏండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం కనిపిస్తుందన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జీవన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఎవర్గ్రీన్ సీఎం అని పేర్కొన్నారు. బండి సంజయ్, అర్వింద్, కిషన్రెడ్డిలే అవుట్ డేటెడ్ ఎంపీలు అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 15 సీట్లే వస్తాయని బండి సంజయ్ చిలుక జ్యోతిష్యం చెబుతున్నాడని అన్నారు. అసలు బీజేపీకి 15 సీట్లలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. బండి సంజయ్ నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని హితువు పలికారు. సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్చైర్మన్ షేక్ మున్నా, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ఉప సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.