గాంధారి/ రామారెడ్డి, అక్టోబర్ 29: సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి, ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని అన్నారు. ఐదేండ్లలో ముదెల్లి గ్రామానికి అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాలకు దాదాపు రూ.47కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మ్యానిఫెస్టోలో చేర్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తారని చెప్పారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీరావు, జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధబలరాం, ఏఎంసీ చైర్మన్ సత్యంరావు, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్, విండో చైర్మన్ పెద్దబూరీ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని శ్రీకాలభైరవ స్వామి ఆలయంలో వాహనానికి పూజలు చేయించారు. అనంతరం గ్రామంలో ప్రచారం చేశారు. సదాశివనగర్ నుంచి రామారెడ్డి వరకు డబుల్ రోడ్డు, రామారెడ్డిలో సీసీ రోడ్డు, డబుల్ రోడ్డును వేయించినట్లు ఎమ్మెల్యే జాజాల గుర్తుచేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కందూరి బాలమణి పెద్దలింబాద్రి తదితరులు పాల్గొన్నారు.