ఖలీల్వాడి, నవంబర్ 8 : సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చారని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘంలో మేదరి కులస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిగాల హాజరై మాట్లాడారు. మేదరి కులస్తుల అభ్యున్నతికి అండగా ఉంటామన్నారు. జిల్లాకేంద్రంలోని బురుడుగల్లీలో మేదరి సంఘం కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం రూ. 10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన తర్పలకు కూడా నిధులు మంజూరు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన బీసీబంధు పథకం ద్వారా నగరంలోని 26 మంది మేదరి కులస్తులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. మిగతా వారికి కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.
నగరాన్ని తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ప్రతి డివిజన్లోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, నగరంలోని ప్రధాన రోడ్లను విస్తరింపజేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందజేస్తున్నామన్నారు. నగరంలో వైకుంఠధామాలు, ఐటీ హబ్, న్యాక్ భవన్, ఓపెన్ జిమ్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాల నిర్మాణంతోపాటు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అధికారంలోకి రాగానే అమలుచేస్తామన్నారు. నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. కారు గుర్తుకే ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నాయకులు, మేదరి కులస్తులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.