సారంగాపూర్, మార్చి 13: సారంగాపూర్లోని నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు బుధవారం సందర్శించారు. ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలను, స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులు, రైతు నాయకులతో భేటీ అయ్యారు. 2008-09 సీజన్ నుంచి మూతబడిన సహకార చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం సహకార రంగంలోనే కొనసాగించాలని రైతు ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం తోడ్పాటునందిస్తే ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు చెరుకు పంట పండించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ నిజాంషుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సబ్కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. తాను నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని సైతం పునరుద్ధరించాలని సబ్కమిటీతోపాటు సీఎంను కూడా కోరామన్నారు. దీంతో ఎన్సీఎస్ఎఫ్ స్థితిగతులపై నివేదిక అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మాగారాన్ని ప్రైవేట్పరం చేయబోమని, ఫ్యాక్టరీ నిర్వహణపై ప్రభుత్వం సహేతుక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.
ఎన్సీఎస్ఎఫ్కు చెందిన పూర్తి వివరాలను రెండు రోజుల్లో తనకు నివేదించాలని ఇన్చార్జి ఎండీ రవిని ఆదేశించారు. వారి వెంట నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, శ్రీరాందత్తు, అఖిల భారత చెరుకు విభాగం కన్వీనర్ కొండెల సాయిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్య, బొడ్డు గంగారెడ్డి తదితరులు ఉన్నారు.