డిచ్పల్లి, ఆగస్టు 25: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలకు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మోసపోతే తెలంగాణ గోసపడే రోజులు వస్తాయని చెప్పారు. మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం(టీటీడీసీ)లో దివ్యాంగులు, బీడీ టేకేదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో వారు సగర్వంగా బతకాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దివ్యాంగులకు పింఛన్ రూ. 3,016 నుంచి రూ.4,016 లకు పెంచారని తెలిపారు. జిల్లాలో నిజామాబాద్ రూరల్లోనే ఎక్కువగా పింఛన్లు ఉన్నాయని చెప్పారు. తన సొంత డబ్బులతో 1700 మంది దివ్యాంగులకు బస్సుపాస్లను ఇచ్చానని, ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రూరల్ నియోజకవర్గంలో 62, 527 మంది లబ్ధిదారులకు పింఛన్లు వస్తున్నాయని తెలిపారు. నెలకు రూ.13కోట్ల 44లక్షల 38వేల 308 చెల్లిస్తున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించిన సమయంలో దివ్యాంగులకు కేవలం రూ. 500 మాత్రమే పింఛన్ ఇచ్చేవారని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ర్టాల్లో అమలు కావడం లేదన్నారు. జిల్లాలోనే అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలో లక్షా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనలాంటి ఎమ్మెల్యేలను గెలిపిస్తే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మరోమారు అవకాశం కల్పిస్తే రెట్టింపు అభివృద్ధిని చేస్తానన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో చందర్ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, హన్మంత్రెడ్డి, కన్నెరాం, చింత శ్రీనివాస్రెడ్డి, మోహన్రెడ్డి, సాయిలు, పద్మారావు, ఎంపీడీవోలు గోపిబాబు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ బీసీ బంధు ..
ఖలీల్వాడి, ఆగస్టు 25 : అర్హులందరికీ బీసీబంధు అందజేస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నగరంలోని భారతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 300 మంది లబ్ధిదారులకు బీసీబంధు చెక్కులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. దశల వారీగా అర్హులందరికీ బీసీ బంధు అందిస్తామన్నారు. బీసీ బంధును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళ్ కన్వీనర్ దేవేందర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.