ఖలీల్వాడి, జూలై 18: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధికారులను ఆదేశించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలపై మంగళవారం రాత్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నమోదైన వర్షపాతం వివరాలను తెలుసుకున్నారు. సిరికొండ, ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చెరువుల పరిస్థితులపై ఆరా తీయగా.. రూరల్లో మొత్తం 304 చెరువులున్నాయని, అందులో 100 చెరువులు వంద ఎకరాలకు పైగా సాగునీరందిస్తాయని, మిగతా 204 చెరువులు వంద ఎకరాల్లోపు నీరందిస్తాయని తెలిపారు.
ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో చెరువులన్నీ 70శాతం మేర నిండి ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. మున్ముందు కురిసే వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని బాజిరెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పెద్ద చెరువులైన జక్రాన్పల్లి, న్యావనంది, ధర్పల్లి, ఒన్నాజీపేట్, బొడ్డిమామిడి చెరువు, గుండారం, మల్కాపూర్ చెరువుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెక్డ్యాముల్లో నీరు సమృద్ధిగా చేరిందని, అలుగులు పారుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న గన్నారం, పడకల్ చెరువుల మరమ్మతు పనులు పూర్తయ్యాయని, నీరు సమృద్ధిగా వచ్చి చేరుతున్నదని తెలిపారు. ఎత్తిపోతల పథకాల వద్ద సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాలని సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఈఈలు, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు.