ధర్పల్లి, మే 29 : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న దమ్ము, ధైర్యమున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ది అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష అని, ఎంత దొరికితే అంతకాడికి దోచుకోవాలనే ఆకాంక్ష కాంగ్రెస్, బీజేపీలదని అన్నారు. ప్రజల సంక్షేమం, ఆదర్శ తెలంగాణ సాధన కోసం ఇంకేం చేద్దామనే ఆలోచన సీఎం కేసీఆర్దన్నారు. మత రాజకీయాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ఆలోచన బీజేపీ నాయకులదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారో అతనికే తెలియదన్నారు. బీజేపీకి కర్ణాటకలో ప్రజలు చావుదెబ్బ కొట్టారన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి శూన్యమని, ఆ రాష్ర్టాల ప్రజలు తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతూ ఆనందంగా జీవిస్తున్నారన్నారు. ఇవన్నీ జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు, అబద్ధాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న తమకు ఎన్నికల్లో అండగా నిలువాలని, ఐదేండ్లు మీకు అండగా ఉంటూ ఆదర్శవంతమైన పాలనను అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ధర్పల్లి మండలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ధర్పల్లిలో త్వరలోనే సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేస్తానన్నారు. బీఆర్ఎస్కు 60 లక్షల మంది కార్యకర్తలున్నారని, అంతా ఒక కుటుంబంలా పనిచేసి బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.
బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు : మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్
బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా దక్షిణ భారతదేశంలో ఒక్క సీటు కూడా గెలవదని మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. రాష్ట్రంలో గులాబీ పండుగ జరుగుతుందని, ఎక్కడ చూసినా ప్రజలు ఉద్యమపార్టీకి అండగా నిలుస్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాలకు మేలు చేయాలని రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని గుర్తుచేశారు. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్వన్గా నిలిపారన్నారు. ఎవరికీ లేని ఘనత జిల్లాలో బాజిరెడ్డి గోవర్ధన్కు ఉందన్నారు. జిల్లాలో 55 శాతం ప్రజల మద్దతు ఇప్పటికీ ఆయనకున్నదని సర్వేలు చెబుతున్నాయంటే ప్రజల మనిషి అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. రూరల్ ప్రాంత ప్రజలు 70శాతం బాజిరెడ్డినే కోరుకుంటున్నారని, ఎన్నికల నాటికి ఆయన ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కార్యకర్తలనుద్దేశించి పంపిన సందేశాన్ని జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ చదివి వినిపించారు. కార్యకర్తలు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా సాయం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన గోడప్రతులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, ప్రధాన కార్యదర్శి గోపాల్, సొసైటీ చైర్మన్లు చెలిమెల చిన్నారెడ్డి, ధర్మయ్యగారి రాజేందర్రెడ్డి, ఎం.రాజేందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొండ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.