చినుకు జాడలేక ఎడారిగా మారిన తటాకాలు.. గుక్కెడు నీళ్లు లేక తడారిన గొంతులు.. బీడువారిన పంట పొలాలు.. మూటాముల్లె సర్దుకుని ముంబై, దుబాయికి వలసలు.. ఇదీ ఒకనాటి మన దుస్థితి. కానీ నేడు పరిస్థితి మారింది. దశాబ్ది కాలగతిలో అచ్చెరువొందే ప్రగతి కళ్ల ముందు సాక్షాత్కారమైంది. తడారిన ప్రాంతంలో సీఎం కేసీఆర్ కృషితో సుందర సు‘జల’ దృశ్యం ఆవిష్కృతమైంది. ఎక్కడ చూసినా నీళ్లు.. అంతటా జలధారల పరవళ్లు.. ఫలితం బీడు వారిన భూములు పచ్చబడ్డాయి. సిరిధారలతో బంగారపు సిరులు పండుతున్నాయి. ఊరిలోనే దండిగా ఉపాధి దొరికి వలసలు ఆగిపోయాయి. పొరుగు రాష్ర్టాల నుంచి అనేక కుటుంబాలు పొట్టచేత పట్టుకొని వస్తున్నాయి. ప్రభుత్వ పుణ్యమా అని పంటల సాగుకు పెట్టుబడి రందీ లేదు. క‘న్నీటి’ కష్టాల్లేవు. కరెంట్ కోతల్లేవు. ఇప్పుడు ఒక్క రైతే కాదు.. కూలీలు, డ్రైవర్లు, లారీలు, హార్వెస్టర్లు యజమానులు.. ఇలా అందరికీ ఉపాధి దొరుకుతున్నది. ప్రతి ఒక్కరి ముఖంలో ప్రగతి తాలుకు చిరునామా స్పష్టంగా గోచరిస్తున్నది. ఇదీ దశాబ్దాల వెనుకబాటును మార్చిన కేసీఆర్ మార్కు పాలన. దేశమే అబ్బురపడి ఆసక్తిగా గమనిస్తున్న తెలంగాణ.
– నిజామాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఒకప్పుడు చేద్దామంటే పనిఉండేది కాదు. చేసేది లేక ఉన్న వ్యవసాయ భూములను బీడుగా వదిలేసి గల్ఫ్ బాట పట్టేది. లేదంటే ఎక్కడో ఒకచోట వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో కూలీ పనిచేసుకొని బతుకీడ్చేది. కాలం కలిసి రాక, చేతిలో చిల్లిగవ్వ లేక సతమతమైన పరిస్థితులు అనేకం. ఇలాంటి దుస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఎంతగానో మార్పునకు నోచుకున్నది. ఇదంతా కేసీఆర్ పరిపాలనలో జరిగిన జల సంబురంతో సాకారమైన జల విజయమే. సాగుకు నిరంతర విద్యుత్, జల వనరుల కల్పన, ఎరువులు, విత్తనాలను సకాలంలో సరఫరా, పంటల కొనుగోళ్లు, రైతుకు పెట్టుబడి సాయం ఒకటేమిటి అనేకనేక చర్యలతో రైతులంతా పొలాల్లో అడుగు పెట్టి సంబురంగా సాగును నడిపిస్తున్నారు. నాలుగు పైసలు సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. గల్ఫ్ బాటకు బైబై చెప్పి సొంతూర్లోనే గౌరవంగా బతికేందుకు కేసీఆర్ పరిపాలనలో నీటి వసతుల కల్పనే ముఖ్య కారణంగా నిలుస్తున్నది. మిషన్ కాకతీయ పథకం ద్వారా వేలాది చెరువుల్లో పూడికతీసి తూములను మరమ్మతులు చేయించడంతో పంట పొలాలకు నీటి పారకం పెరిగింది. కాలమేదైనా సాగు మాత్రం ఆగడం లేదు. సమృద్ధిగా వ్యవసాయ రంగం పరుగులు తీస్తున్న ఈ సమయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి వలసలు పూర్తిగా బంద్ కాగా మన ప్రాంతానికే ఉత్తరాది రాష్ర్టాల వారంతా క్యూ కడుతుండడం మారిన పరిస్థితులకు బహుళ మార్పునకు చిహ్నంగా నిలుస్తున్నది.
సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా నీటివనరులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చెరువుల కింద ఆయకట్టు బీడుగా దర్శనం ఇచ్చేది. సామర్థ్యం ఉన్నప్పటికీ చెరువుల్లోకి వరద చేరే పరిస్థితి లేకపోయేది. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు (మిషన్ కాకతీయ పథకం)చెరువులను బాగు చేసుకోవడం ఒక్కటే కాదు. వర్షపు నీటిని 10నెలల పాటు నిల్వ చేసుకొని ఆయకట్టుకు కొరత లేకుండా సాగు నీరు అందించడం ప్రధానమైన ధ్యేయం. తటాకాల్లో పూడికతీత పనులు చేపట్టంతో చెరువుల సామర్థ్యం పెరిగింది. దశాబ్దాలుగా కూరుకుపోయిన పూడికను తీయడంతో చెరువులకు పునర్వైభవం వచ్చింది. దీంతో వర్షపు నీరు ఎక్కువగా నిల్వ చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు వరకు భారీ వానలు పడితే ఎక్కడో ఒక చోట చెరువులకు బుంగ పడడం, గండిపడి కొట్టుకపోవడం వంటివి కనిపించేవి. ఇప్పుడు చెరువు కట్టలు బలోపేతం చేయడంతో చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి. లీకేజీలతో కొట్టుమిట్టాడిన తూములు బాగుపడడంతో ఇబ్బందులు కనిపించడం లేదు. చెరువు చుట్టూత భూగర్భ జలాలు సైతం గణనీయంగా వృద్ధిలోకి రావడమూ కనిపిస్తున్నది. నేలపై కురిసిన వర్షపు చినుకులు వాగులు, వంకల గుండా పయనించి ఆయా జలాశయాల్లో కలుస్తున్నాయి. చెరువుల్లోకి గతంలో వర్షపు నీరు చేరే అవకాశం ఉండేది. ఇప్పుడు కాలువలు సైతం మరమ్మతులు చేయడంతో సులువుగా వరద చేరి నిండుకుండల్లా జలాశయాలు తలపిస్తున్నాయి.
డిచ్పల్లి, సెప్టెంబర్ 23: ఆ దేవుని దయతో.. కేసీఆర్ అడుగు పుణ్యమో తెలియదు కానీ ప్రతి ఏడాదీ వానలు కురుస్తున్నాయి. దీంతో ఎప్పుడూ మా ఊరి చెరువుల్లో నీళ్లు ఉంటున్నాయి. ఎనిమిదేండ్ల కాలంలో వ్యవసాయం ఎప్పుడూ ఆగలేదు. భూములన్నీ పచ్చగానే ఉన్నాయి. పంటలకు సరిపడా నీళ్లు కూడా ఉన్నాయి. బోర్లు కూడా ఫుల్లుగా పోస్తున్నాయి. ఎనిమిదేండ్ల ముందట వానకాలంలో ఇది వానకాలమా… ఎండా కాలమా అన్నట్లుగా ఉంటుండె. పొలాలు నీళ్లు లేక నెర్రలు వారుతుండె. చెరువులన్నీ ఎండిపోయి కనిపిస్తుండె. కాలం సరిగ్గా లేకపోవడంతో అప్పుడు ఒక్క పంట పండడమే మహా అన్నట్లుగా ఉంటుండె. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వానదేవుడు కరుణించిండు… మా పంటలు సమృద్ధిగా పండేలా దీవించడంతో వర్షాలు బాగా కురుస్తున్నాయి. పంటలు కూడా సమృద్ధిగా పండి, ఇంటికి ఆదాయం వస్తున్నది.
– రేండ్ల లక్ష్మణ్, రైతు,సాంపల్లి
ఏ టైంల కేసీఆర్ సీఎం అయ్యిం డో కానీ మస్తుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏ సంవత్సరం కూ డా వానకాలంలో సరైన వానలు కురవలేదనేది లేదు. దీంతో మా ఊరితోపాటు చుట్టు పక్కల ఊర్ల లో ఉన్న పడావు భూములు పంటలతో కళకళలాడుతున్నాయి. బోర్లన్నీ ఫుల్లుగా పోస్తున్నాయి. దీంతో మా రైతు కూలీలకు ఫుల్లుగా పని ఉంటుంది. వరి నారు పోసిన నాటి నుంచి ఒడ్లు నరకడం, దమ్ము చేసే టైంల, నాట్లు వేసే టైంల, పంటలకు ఎరువులు వేసే టైంల, కలుపుతీత, కోత కోసే టైంల, వడ్లు ఆరబోసేటప్పుడు, ధాన్యం కాంటా పెట్టేటప్పుడు ఇలా ఎక్కడ, ఎప్పుడు చూసినా పనులే ఉంటున్నాయి. తీరం లేకుండా పనులు దొరుకుతున్నాయి. దీంతో వేరే దగ్గరికి పోకుండా ఉన్న ఊరిలోనే మస్తుగా పనిచేసి సంపాదించుకుంటున్నాం.
– గూడల నర్సవ్వ, రైతు కూలీ, గొల్లపల్లి
ఇప్పుడు నీళ్లకు ఢోకా లేదు. కాలూర్ గ్రామ శివారులో 15ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పండిస్తున్నాను. ఎల్లయ్య చెరువు ద్వారా వచ్చే నీరు పంటలకు సరిపోతున్నది. భూమి ఉన్న రైతులకు లాభం చేస్తున్నట్లుగానే సీఎం కేసీఆర్ సార్ మాలాంటి కౌలు రైతులకు కూడా తగిన బెనిఫిట్స్ అందించాలి.
– గాండ్ల లక్ష్మణ్, రైతు, గౌతంనగర్, నిజామాబాద్
తెలంగాణ రాకముందు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలు, చేస్తున్న కృషి ఫలితంగా అందరి బతుకులు సమూలంగా మారాయి. అందుకు నేనే ఒక పెద్ద ఉదాహరణ. కొద్దిపాటి భూమి ఉన్నా కూలీ నాలీ చేసుకుంటూ జీవనం గడిపేవాన్ని. కానీ 8, 9 ఏండ్లుగా మెళ్లిమెళ్లిగా మార్పు లు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న హరితహారం కారణంగానో వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో లోన్ తీసుకొని హార్వెస్టర్ను కొనుగోలు చేశాను. ఒకప్పుడు కూలీగా పనిచేసిన నేనే హార్వెస్టర్కు యజమానిని అయ్యాను. వరికోతలు వచ్చిందంటే హార్వెస్టర్కు సమయమే దొరకదు. డ్రైవర్ను పెట్టుకొని హా ర్వెస్టర్ను నడుపుతున్నాను. దీంతో నాలుగు రాళ్లు సంపాదించుకోగలిగాను. – బదావత్ సకారాం,
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో చాలామంది గ్రామాల నుంచి గల్ఫ్కు ఇతరత్రా ప్రదేశాలకు ఉపాధి కోసం తిప్పలు పడి విమానం ఎక్కి, ఎడారి దేశాలకు వెళ్లేది. వలస వెళ్లిన కుటుంబాలు కకావికలమై జీవితాలు ఛిద్రమై బతుకు జీవుడా అనుకుంటూ అప్పులు మూటగట్టుకొని తీవ్రంగా నష్టపోయేది. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి గడ్డ నుంచి గల్ఫ్ బాట గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడేకంగా ఇతర ప్రాంతాల నుంచి మన వ్యవసాయ పొలాల్లో పనులు చేసేందుకు వలస వస్తున్నారు. మిషన్కాకతీయ, ఎస్సారెస్పీ పునరుజ్జీవం, కాలువల ఆధునీకరణ, కాళేశ్వరం లాంటి పథకాలతో అనేక ప్రాంతాలను అనుసంధానం చేయడంతో బీడు భూములకు సాగు నీళ్లు పారకం సాధ్యమైంది. దీంతో ఖాళీగా కూర్చునే రైతులే ఇప్పుడేకంగా ఏడాది పొడవునా చేతినిండా పనులను దక్కించుకొని సాగులో బిజీ అయ్యారు. పండుగలా మారిన వ్యవసాయంతో బీడు భూములు సాగులోకి వచ్చాయి. దీంతో కూలీ పనులు చేసే వారి కొరత గ్రామాల్లో వేధిస్తుండగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నాట్లు, వరికోతలు, కొనుగోళ్లలో ధాన్యం తరలింపులో శ్రమించేందుకు ఉత్తరాది నుంచి భారీగా కూలీలు వలస వస్తున్నారు. సర్కారు యాంత్రీకరణను ప్రోత్సహించడంతోనూ ట్రాక్టర్ డ్రైవర్లు, హర్వెస్టర్ డ్రైవర్ల రూపంలోనూ ఉపాధి మార్గాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం డ్రోన్ వినియోగంతో సాంకేతికత తోడవ్వడంతో ఉపాధి మరింత విస్తృతం అవుతున్నది.
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 23: దుబాయిలో ఐదేండ్లు ఉండి 2015లో తిరిగొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాక్టర్ కొన్నాను. నాకు అర ఎకరం భూమి ఉన్నది. పండించడానికి నీరు సమృద్ధిగా ఉండడంతో ప్రతి సీజన్లో 30ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి పండిస్తున్నాను. ఒక్కో సీజన్లో కౌలుకు మాట్లాడుకున్న డబ్బులు, పంట పెట్టుబడి ఖర్చులు అన్నీ పోను నాకు లక్షా 50వేల రూపాయల లాభం వస్తున్నది. ఏడాదిలో రెండు పంటలు పండిస్తే రూ.3లక్షల ఆదాయం వస్తుంది. నాకు భార్య, ముగ్గురు పిల్లలు, అమ్మనాన్నలు, మేనకోడలు నా సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నారు. మావోళ్లను బతికించడం కోసం ఊర్లో పనులు లేక 2010లో దుబాయ్ వెళ్లాను. అక్కడ ఐదేండ్లు ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. తెలంగాణ వచ్చినాక సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడని ఇక్కడికే వచ్చి కౌలుకు పంట పండిస్తే మంచిగా బతుకొచ్చునని మా అమ్మనాన్నలు చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ కొనుక్కొని ఇతర రైతుల పొలాల పనులు చేస్తున్నాను. దీంతో సీజన్లో రూ.20వేలు లాభం వస్తున్నది. ఇప్పుడు మా కుటుంబ సభ్యులమంతా సంతోషంగా బతుకుతున్నాం.
– లచ్చోళ్ల గణేశ్, ట్రాక్టర్ యజమాని, కొండూర్
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 23: సీఎం కేసీఆర్ సార్ వచ్చాక ఊర్లో ఉన్న చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసిండ్రు. చెక్డ్యామ్లు కట్టిండు. ఇప్పుడు పంటలు పండించేటోళ్లకు నీళ్లు బాగా సౌలతైంది. ఇంతకుముందు నీరు సరిపడా లేనందున కొంతభూమిలో మాత్రమే పంటలు పండించేవారు. మిగతా భూములు పడిత్గానే ఉంటుండే. ఇప్పుడు అట్ల కాదు. భూమి పడిత్గా ఉంచకుండా పంటలు పండిస్తున్నారు. నేను ట్రాక్టర్ ద్వారా ప్రతి సీజన్లో 50ఎకరాల దుక్కి దున్ని, గొర్రు కట్టి దమ్ము తదితర వ్యవసాయ పనులు చేస్తున్నాను. ఒక ఎకరానికి రూ.4వేల చొప్పున 50ఎకరాలకు ట్రాక్టర్ ద్వారా పనిచేస్తే రూ.2లక్షలు వస్తున్నాయి. అందులో లక్ష రూపాయలు ఒక సీజన్లో ఖర్చులు పోను రూ.లక్ష మిగులుగుతున్నాయి.. ఇప్పుడు రైతులు, ట్రాక్టర్ యజమానులు, రైతు కూలీలందరికీ లాభం చేకూరి సంతోషంగా ఉంటున్నాం.
– మోతె నర్సయ్య, రైతు, ట్రాక్టర్ యజమాని, ఆకుల కొండూర్
గాంధారి, సెప్టెంబర్ 23: సీఎం కేసీఆర్ కృషితో చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు చేయడంతో మా ఊరు చెరువు ఎప్పు డూ నిండుగా ఉంటున్నది. దీం తో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. రెండు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ఎండాకాలంలో కూడా నీరు ఉ టున్నది. భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లో నీరు తగ్గడం లేదు. వానకాలంతోపాటు యాసంగిలో సైతం వరి పంటను సాగు చేస్తున్నాం. ఏడాది పొడువునా వ్యవసాయ పనులు ఉండడంతో గ్రామంలోనే ఉపాధి దొరుకుతున్నది. నాలాంటి యువరైతులు చాలా మందికి వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. రెండు పంటలు పండడంతో ఆర్థిక వృద్ధి సాధిస్తున్నాం.
– చాకలి కాశీరాం,యువ రైతు, గౌరారం, గాంధారి
గాంధారి, సెప్టెంబర్ 23: మా ఊరి చెరువుల్లో ఎల్లప్పుడూ నీరు ఉండడంతో రెండు పంట లు పండిస్తున్నారు. దీంతో ట్రాక్టర్లకు మస్తు గిరాకీ ఉంటుంది. చెరువు ఆయకట్టు కింద వరినా ట్లు వేసేటప్పుడు నెల రోజులపా టు కేజ్వీల్స్కి డిమాండ్ ఉం టుంది. దీంతో నాలాంటి చాలా మంది డ్రైవర్లకు ఉపాధి దొరుకుతున్నది. గతంలో చెరువుల్లో నీరు లేనప్పుడు, డ్రైవింగ్ చేయడానికి ఇతర ఊర్లకు వెళ్లేవాళ్లం. ప్రస్తుతం మా ఊరిలోనే ఉంటున్నాము. కేసీఆర్ పాలనలో చెరువులు బాగు చేయడంతో రెండు పంటలు పండుతున్నాయి. రెండు సీజన్లలో దుక్కులుదున్నడం దగ్గర నుంచి, కేజ్వీల్స్ తిప్పేంత వరకు ట్రాక్టర్లకు పని ఉంటున్నది.
-కేషబోయిన అంజయ్య, డ్రైవర్, గౌరారం
గాంధారి, సెప్టెంబర్ 23: ఆరేండ్లుగా చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో వానకాలం, ఎండకాలం రెండుసీజన్లలో ట్రాక్టర్లకు పని దొరుకుతున్నది. ట్రాక్టర్ను మా సొంత పొలంతోపాటు ఇతరుల పొలాల్లో కేజ్వీల్ తిప్పడం, దుక్కి దున్నడానికి పంపిస్తుంటాం. ప్రస్తుతం మా ఊరిలో చెరువుల కింద రెండు పంటలు పండుతున్నాయి. దీంతో ట్రాక్టర్లకి బాగా డిమాండ్ ఉన్నది. గతంలో పనులు లేక ట్రాక్టర్ల నిర్వహణకు ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఖర్చులన్నీ పోను డబ్బులు మిగులుతున్నాయి.
– బట్టి అనిల్గౌడ్, ట్రాక్టర్ యజమాని, గౌరారం
డిచ్పల్లి, సెప్టెంబర్ 23: గతంలో పంటలు పండుడు అంతంత మాత్రమే. దీంతో పంట ఉత్పతులు తరలించడానికి ఊరికి ఒక ట్రాక్టర్ ఉంటే సరిపోతుండె. గత ఎనిమిదేండ్ల నుంచి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అధిక మొత్తం లో పండడంతో వాటి ఉత్పత్తులను తరలించడానికి మస్తుగా గిరాకీ ఉంటున్నది. తెలంగాణ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసే సమయంలో ట్రాక్టర్లు, లారీలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. తిరం లేకుండా వడ్లను రైతుల కాంటాల నుంచి రైస్మిల్లులకు తరలిస్తున్నాం. దీంతో మేము తీసుకున్న ట్రాక్టర్లు, లారీల ఖర్చులు పోను.. మా డ్రైవర్లకు ఉపాధి లభిస్తున్నది.
– బద్దుల శ్రీకాంత్, ట్రాక్టర్ డ్రైవర్, సుద్దపల్లి