Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ ఇప్పటికే భారతదేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమా, టైటిల్ & కాన్సెప్ట్ రివీల్ వీడియోతోనే ప్రేక్షకుల ఊహలకు రెక్కలు ఇచ్చింది. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ టీమ్తో, ఐమాక్స్ వెర్షన్లో రూపొందుతున్న ఈ మూవీని జక్కన్న ఇప్పటివరకు చూడని విధంగా తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న విషయం ఇప్పటికే ఫ్యాన్స్కు తెలిసిందే. ఈ పాత్ర కోసం ఆయన భారతీయ ప్రాచీన యుద్ధ కళ అయిన కలరిపయట్టు ప్రత్యేకంగా నేర్చుకున్నారని సమాచారం.
నెలల తరబడి శిక్షణ తీసుకుని ఈ క్యారెక్టర్కు సిద్ధమైన మహేష్ కమిట్మెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘వారణాసి’పై అంచనాలు అంతర్జాతీయ స్థాయిలో పెరగడానికి మరో కారణం – ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపించారనే ప్రచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. ఇటీవల విడుదలైన టీజర్లో చూపిన విజువల్స్ సినీ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు కథను లింక్ చేస్తూ వారణాసి, మణికర్ణిక ఘాట్, త్రేతాయుగం నాటి లంకా నగరం, అంబొసెల్లీ వైల్డర్నెస్, వనాంచల్ ఉగ్రభట్టి గుహ, ఆస్టరాయిడ్ శాంభవి, రోస్ ఐస్ షెల్ఫ్ వంటి విభిన్న ప్రదేశాలను ఒకే కథా ప్రవాహంలో మేళవించిన తీరు ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది.
ఇప్పుడు మరో సంచలన అప్డేట్ వైరల్ అవుతోంది. ‘వారణాసి’ టీజర్ను పారిస్లోని ప్రఖ్యాత లే గ్రాండ్ లెక్స్ థియేటర్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు సమాచారం. జనవరి 5న రాత్రి 9 గంటలకు ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరగనుండగా, దీనిని ఇండియన్ మూవీస్ను యూరప్లో రిలీజ్ చేసే సంస్థ ఆన్నా ఫిలింస్ కన్ఫర్మ్ చేసింది. ఇలా లే గ్రాండ్ లెక్స్లో ప్రదర్శితమయ్యే తొలి భారతీయ సినిమా టీజర్గా ‘వారణాసి’ కొత్త రికార్డు సృష్టించబోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను ప్రపంచ సినీ దిగ్గజాల దృష్టికి తీసుకెళ్లి, ఆస్కార్ వేదిక వరకు చేర్చిన రాజమౌళి, అదే తరహా వ్యూహాన్ని ‘వారణాసి’ విషయంలోనూ అమలు చేస్తున్నారని సమాచారం. సినిమా పూర్తయ్యేలోపే అంతర్జాతీయ మార్కెట్లో బలమైన గుర్తింపు తీసుకురావాలన్నదే లక్ష్యంగా మేకర్స్ ముందుకు సాగుతున్నారు. 2027 మార్చిలో మూవీని గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.