అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబుల్బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్ల ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరుతున్నది.
జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇండ్లు, కార్యాలయాలు, కూడళ్లు, పార్టీ ఆఫీసుల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నది. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. దేశ భక్తి చాటే విధంగా ఆయా విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతంగా నృత్యాలు చేసి అలరించారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 1
నిజామాబాద్ కల్చరల్/నిజామాబాద్ స్పోర్ట్స్, ఆగస్టు 15 : జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు, అధికారులు, ప్రజాప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాల్కొండ కేజీబీవీ విద్యార్థులు జయహో జయ జయహో అంటూ సాగే పాటకు ఇచ్చిన నృత్యప్రదర్శన అలరించింది. గాయత్రీనగర్ విశ్వవికాస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు “ముచ్చటైన మన ఊరి కథ వింటారా…” అనే పాటపై చేసిన డ్యాన్స్ అందరి మన్ననలను అందుకున్నది. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మెమోంటోలు ఇచ్చి అభినందించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖల శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, నీటిపారుదల శాఖ, మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా వైద్యశాఖ, 108, 102 సేవలు, పశువైద్య, పశుసంవర్థక శాఖ, విజయ డెయిరీ పాల ఉత్పత్తిపై, ఉద్యానవన శాఖ ద్వారా పంటల సాగుపై శకటాలను ప్రదర్శించారు. నగరపాలక సంస్థ ద్వారా రూ.246 కోట్లతో మురుగునీటిని శుద్ధి చేసి మంచి నీరు అందించే ప్రక్రియను శకటాల ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి పశుసంవర్ధక శాఖ, రెండో బహుమతి మహిళా శిశు సంక్షేమ శాఖ, మూడో బహుమతి గిరిజన సంక్షేమ శాఖ అందుకున్నది.