కమ్మర్పల్లి(మోర్తాడ్), జూన్ 5: ‘పసుపుబోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ ..ఎంపీగా గెలిచాక పసుపుబోర్డు తేకపోతే ఏం చేయగలిగాం.. ఇక ముందుకూడా అటువంటి పరిస్థితే ఉంటుంది..ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి..’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పసుపుబోర్డు రాకపాయే.. పసుపునకు మద్దతు ధర లేకపాయే..రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో గమనించాలని కోరారు. కేవలం కమ్మర్పల్లి గ్రామానికి తనను గెలిపించడంవల్ల రూ.70కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని, మీ ఓట్లతో గెలిచిన ఎంపీ అర్వింద్ ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి సెంట్రల్లైటింగ్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలు దగ్గరకొస్తుండడంతో మాయమాటలు, దేవుళ్ల పేర్లు చెప్పి మోసం చేసేందుకు గ్రామాలకు వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పనులు చేసేవారు కావాలో.. మోసం చేసేవారు కావాలో ఆలోచన చేయాలన్నారు. కేవలం తొమ్మిదేండ్ల కాలంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలో రూ.70కోట్లతో అభివృద్ధి చేసుకోగలిగామని.. ఇది సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. 50 ఏండ్ల పాలనలో తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదని, కేంద్ర ప్రభుత్వ పాలనతో మనకేం ఒరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సారథ్యంలో మనమేం సాధించుకోగలిగామనే విషయాలను ప్రజలు ఆలోచించాలని అన్నారు.
‘మంత్రి ప్రశాంత్రెడ్డి, కేసీఆర్ చేసిన పనుల ముందు మన ఆటలు సాగవని, దేవుళ్ల పేరుమీద ఓట్లు రాబట్టాలని, కమ్మర్పల్లిలో సోమవారం జరిగిన బీజేపీ సమావేశం అనంతరం ఆపార్టీ నాయకులు అంతరంగంగా మాట్లాడుకున్నట్లు తెలిసిందన్నారు. దేవుళ్ల పేరు చెప్పి రెచ్చగొట్టే వారిని నమ్మవద్దని సూచించారు. యువకులను రెచ్చగొట్టాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మరోసారి అభివృద్ధి పక్షాన నిలబడుతారో మోసం చేసేవారి పక్షాన ఉండాలో ఆలోచించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమవుతాయని తాము చాలా నష్టపోతామని, బైపాస్రోడ్డు వేస్తే తాము భూములను కోల్పోతామని కమ్మర్పల్లికి చెందిన ప్రజలకు తనకు విన్నవించారని తెలిపారు. ఎవరూ నష్టపోకుండా తాను ప్రయత్నిస్తానని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వందఫీట్ల రోడ్డుమాత్రమే వేయాలని లేఖ రాసినట్లు తెలిపారు. కమ్మర్పల్లి వాసులు నష్టపోకుండా తాను ఎక్కడెక్కడ అడ్డంపడాలో పడ్తానని, ఎంపీగా అర్వింద్ కూడా తనవంతు ప్రయత్నం చేయాలని సూచించారు. అంతకు ముందు మంత్రికి మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ గౌతమి, జడ్పీటీసీ రాధ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, సర్పంచ్ గడ్డంస్వామి, బద్దం రాజేశ్వర్, పాషా, చిన్నారెడ్డి పాల్గొన్నారు.
కమ్మర్పల్లిలో వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాల వారు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.