కమ్మర్పల్లి/ మోర్తాడ్, నవంబర్ 8 : కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవని, ఆ పార్టీ మాయమాటలు నమ్మవద్దని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో పర్యటించారు. ఉదయం కమ్మర్పల్లి మండలంలోని అమీర్ నగర్, ఇనాయత్ నగర్, నర్సాపూర్, సాయంత్రం మోర్తాడ్ మండలం శెట్పల్లి, ధర్మోరా, దోన్కల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి ఆయా గ్రామాల్లో నీరాజనం పలికారు. బోనాలు, వలగొడుగులు, నృత్యాలు చేస్తూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో వేముల మాట్లాడుతూ.. గిరిజనులకు పోడు పట్టాలను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే ఐదేండ్లలో పింఛన్ రూ.5 వేలకు, రైతుబంధు రూ.16 వేలకు పెంచుతామన్నారు. కర్ణాటకలో పది గంటల కరెంటు ఇస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గెలిచాక 5 గంటలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నదని తెలిపారు. కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణలో మళ్లీ రైతులు రాత్రి పూట తోట కాడ నిద్ర పోయే రోజులు వస్తాయని గుర్తుచేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు విద్యుత్ సమస్యలను దూరం చేసిందన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. కావాలంటే ఆ పార్టీలకు చెందిన సోదరులు కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లి చూసి రావాలని సూచించారు. కావాలంటే కారు, దారి ఖర్చులు తానే భరిస్తానని చెప్పారు. చూసి వచ్చిన వారు అంబేద్కర్ విగ్రహాల వద్ద వాస్తవాలు తెలుపాలని సూచించారు.
తెలంగాణలో ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆంధ్రనాయకులంతా ఏకమైతారని, ఏవో కుట్రలు పన్నుతారని ఆరోపించారు. ఎవరేకమైనా సరే కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు మోసపోయే స్థితిలో లేరని అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చంద్రబాబు శిష్యుడని తెలిపారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఏకమై తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని, ఎవరూ ఆగం కావద్దని సూచించారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ బిడ్డలు తిప్పికొడుతారన్నారు. రుణ మాఫీ సంపూర్ణంగా అమలవుతుందని.. అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. రూ.19 వేల కోట్లలో ఇప్పటికే రూ.13 వేల కోట్ల రుణ మాఫీ జరిగి పోయిందన్నారు. మిగతాది కూడా ఆగే ప్రసక్తే లేదని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పింఛన్ రూ.5 వేలకు, రైతు బంధు రూ.16 వేలకు పెరుగక పోతే వచ్చే ఎన్నికల్లో తనను గ్రామాల్లోకి రానీయకండని అన్నారు. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టానని, తన కన్నా ముందు పని చేసిన వారు ఇలా అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారో ఆలోచించాలని కోరారు. అమీర్ నగర్ సర్పంచ్ తండా-అమీర్నగర్ మధ్య గట్టుపొడిచిన వాగు కాలువ పై తాను వచ్చాకే వంతెన మంజూరైనట్లు తెలిపారు. నర్సాపూర్లో ప్రచారం కొనసాగుతుండగా వర్షం కురవగా.. మంత్రి ప్రసంగాన్ని గ్రామస్తులు వానలోనే నిలబడి విన్నారు. శెట్పల్లి, ధర్మోరా, దొన్కల్ గ్రామాల్లో మంత్రి ప్రశాంత్రెడ్డి గజమాలతో సన్మానించి, బోనాలు, వలగొడుగులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో డాక్టర్ మధుశేఖర్, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దంరవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, సర్పంచులు బద్దంగంగారెడ్డి, మండల రాజేశ్వర్, కత్తిలావణ్యముత్తెన్న, ఎంపీటీసీలు అశోక్, శ్రీనివాస్, లావణ్యా సుధాకర్, నవీన్, దుగ్గెన రాజేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.