నిజామాబాద్ క్రైం, మార్చి 24: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రి వేముల శుక్రవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రభుత్వ పరంగా కాకుండా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం అత్యుత్తమ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేసీఆర్ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి తదితర విషయాలపై చర్చించేవారని చెప్పారు. దానికి అనుగుణంగా దేశంలో కొత్తగా ఏర్పాటైన రాష్ర్టాలను అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఇతర అంశాలను కూడా పరిశీలించి తెలంగాణకు మౌలిక వసతులు, పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతల్లో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ క మాండ్ కంట్రోల్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పా టు చేసినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని తెలిపారు.
రాష్ట్రం వచ్చాక పెరిగిన పెట్టుబడులు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడులు 300 శాతం పెరిగాయని, 25 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు. ఏ రాష్ట్రమైనా పురోభివృద్ధి సాధించాలంటే శాంతి భద్రతలు ప్రధానమని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టత, పోలీసుల పనితీరు, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు 160 సీసీ కెమెరాలను అనుసంధానం చేసినట్లు తెలిపారు. 132 కెమెరాలు నిజామాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తాయన్నారు. 28 ప్రత్యేక కెమెరాలతో భద్రత నియమాలను అతిక్రమించిన వారిని గుర్తిస్తాయని, నగరం పోలీసు కంట్రోల్లో ఉంటుందని సీపీ కె.ఆర్.నాగరాజు ఈ సందర్భంగా మంత్రి వేములకు వివరించారు. హైదరాబాద్ నగరం తర్వాత రాష్ట్రంలోనే ఇంతటి గొప్ప ఏర్పాట్లు చేసిన ఘనత కమిషనర్ నాగరాజుకు దక్కుతుందని అభినందించారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చూడాలన్న ఆకాంక్ష ముఖ్యమంత్రికి ఉన్నదని తెలిపారు. గంజాయి వినియోగం కానీ, సరఫరాదారులు ఏ ఒక్కరూ లేకుండా పోలీసులు వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ సెంటర్ నుంచి జిల్లాలో చోటుచేసుకున్న మూడు హత్యలు, వాహనాల చోరీ కేసులను సీసీ కెమెరాల సాయంతో ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగర మేయర్ దండు నీతూ కిరణ్, కార్పొరేటర్ పంచరెడ్డి నర్సుబాయి, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, పోలీస్ హౌసింగ్ బోర్డు ఈఈ టి.ఈశ్వర్, పోలీస్ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
మెండోరాలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
మెండోరా ( ముప్కాల్), మార్చి 24: మెండోరా లో రూ. 2.5 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశా రు. గ్రామానికి వచ్చిన మంత్రికి మహిళలు మంగళహారతులు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. భారీ క్రేన్ సాయంతో మం త్రిని గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే మెండోరాను మండలంగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి చేసేవారెవరు.. మాయ మాటలు చెప్పే వారెవరో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. పని చేసేవారిని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు. డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్ రెడ్డి, ఎంపీపీ సుకన్య , జడ్పీటీసీ గంగాధర్,వేల్పూర్ ఏఎంసీ చైర్పర్సన్ అరుణా నవీన్ గౌడ్, వైస్ ఎంపీపీ సరస్వతీ రవీగౌడ్,తహసీల్దార్ సతీశ్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సామ గంగారెడ్డి, సర్పంచులు మచ్చర్ల రాజారెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.