తెలంగాణ రైతాంగం పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పల్లె నుంచి పట్నం వరకు అన్ని స్థాయిల్లో తీర్మానాలు జరిగాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో జోరుగా సమావేశాలు జరిగాయన్నారు. రైతుల అంశంపై ప్రజాప్రతినిధులంతా ప్రధానికి తీర్మానాలు పంపడం కనీవినీ ఎరుగని ఘట్టమని అన్నారు. నిజామాబాద్లో బుధవారం నిర్వహించిన
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. వడ్ల కొనుగోలు అంశంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని సభ్యులకు వివరించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ కండ్లు తెరువకపోతే పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. తెలంగాణ వడ్లను కేంద్రమే కొనాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కామారెడ్డి జడ్పీ సైతం ధాన్యం కొనుగోలుపై తీర్మానం చేసింది.
తెలంగాణలో వరి పండించాలని రైతులను రెచ్చగొట్టిన బండి సంజయ్ ఇప్పుడు ముఖం చాటేసిండు. ఆయనకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే.. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రం పెద్దలతో ఒప్పించాలి.
-మంత్రి వేముల
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్రంలో ఉన్న అన్ని స్థాయిల్లో కేంద్రమే వడ్లు కొనాలనే అంశంపై భారీగా తీర్మానాలు జరిగాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులందరూ ఏకతాటిపైకి వచ్చి తీర్మానాలు చేశారన్నారు. యాసంగిలో ధాన్యాన్ని కేంద్రమే కొనాలని ఒకే ఒక డిమాండ్తో తీర్మానం చేసి పంపాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో జోరుగా సమావేశాలు జరిగాయన్నారు. రైతుల అంశంపై రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థలు, ప్రజా ప్రతినిధులంతా ప్రధానమంత్రికి తీర్మానాలు పంపడం అనేది కనీవినీ ఎరుగని ఘట్టమని చెప్పారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్రావుతోపాటు కలెక్టర్ నారాయణరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వడ్లను కేంద్రమే కొనాలనే ఏక వ్యాఖ్య తీర్మానాన్ని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన ప్రతిని ప్రధానమంత్రి మోదీకి పంపించనున్నట్లు జడ్పీ చైర్మన్ వెల్లడించారు. తీర్మాన ప్రతిని రాష్ట్ర మంత్రికి జడ్పీ చైర్మన్ విఠల్ రావు, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్రావు అందజేశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు, రైతుల ఆవేదనను తెలియజేసేలా ప్రధానికి ఇదో రకమైన నిరసన సెగ అని మంత్రి చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో 530 జీపీలు, 88 ప్రాథమిక సహకార సంఘాలు, 27 మండల పరిషత్లు, ఏడు మార్కెట్ కమిటీలు, డీసీఎంఎస్, డీసీసీబీ, జడ్పీ తీర్మానాలు కలిపి మొత్తం 655 తీర్మానాలు జరిగాయని వివరించారు.
అంతిమంగా రైతులు పండించిన పంటలను కేంద్రం కొనాల్సిందేనని మంత్రి వేముల అన్నారు. ఈ విధానాన్ని మోదీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందేమీ కాదన్నారు. గతంలో యూపీఏ ప్ర భుత్వం తెచ్చింది కూడా కాదన్నారు. సువిశాలమైన దేశంలో వివిధ రకాల ఆహార అలవాట్లు ఉం డగా… వివిధ ప్రాంతాల్లో విభిన్న పంటలు పండుతాయని మంత్రి వివరించారు. ఒకవేళ ఏదైనా ప్రాంతంలో జరగరాని విపత్తు సంభవిస్తే, పంటలు పండకపోతే, కరువు, వరదలు, యుద్ధం వచ్చినా దేశంలో ఆహార కొరత లేకుండా చూడాల్సిన బాధ్య త కేంద్రానిదేనని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లోనూ దేశప్రజల ఆహార భద్రతను కల్పించేందుకే స్వా తంత్య్రం తొలిరోజుల్లోనే ఆహార భద్ర త చట్టాన్ని తెచ్చారని, ఈ చట్టాన్ని గతంలో అనేక మంది ప్రధానులు, కేంద్రంలో పరిపాలన చేసిన పార్టీలు పాటించాయన్నారు. కానిప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడుస్తున్నదన్నారు. కేంద్రమే తమ సంస్థల ద్వా రా వివిధ ప్రాంతాల్లో పండే పంటలను ఆయా ప్రజల అవసరాలకు సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొంత కాలంగాపంటలొక్కటే కాకుండా చాలా విషయాల్లో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను పట్టించుకోవడం లేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రైతుల జీవన్మరణ ససమస్యతోనూ కేంద్రం ఆటలాడుతున్నదని మండిపడ్డారు. గుజరాత్, పంజాబ్లో రెండు పంటలు పండిస్తే అక్కడి పంటలు కొంటున్నారన్నారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన చర్చల సారాంశాన్ని జడ్పీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. కేంద్ర ఆహార మంత్రిగా ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యం గా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మన వడ్లు కొనమని చెప్పినప్పుడు ఎందు కు కొనరో చెప్పాలని గట్టిగా అడిగినట్లుగా మంత్రి వివరించారు. మన వాతావరణ పరిస్థితుల్లో భాగం గా నూకలు ఎక్కువగా వస్తాయని చెబితే ప్రజలకు నూకలు తినిపియ్యాలనడం కేంద్ర మంత్రికి తగదన్నారు. గతంలో సమైక్య పాలనలో తెలంగాణకు పైసా ఇవ్వనని చెప్పిన కిరణ్ కుమార్రెడ్డికి తెలంగాణ శాపం తగిలి కాలగర్భంలో కలిశాడని గుర్తు చేశారు. పీయూష్ గోయ ల్ మాటలు ఆయన కండకావరానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శాపం తగిలి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సైతం అదే గతి పడుతుందన్నారు. 2014లో నిజామాబాద్లో 4లక్షల ఎకరాల్లో వరి వేస్తే ఈరోజు 7లక్షల 80వేల ఎకరాల్లో వరి సాగవుతుందని ఇది నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు. సా గుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. కేసీఆర్ సాగు విధానాలతో వరి ఉత్పత్తి పెరిగిందంటే పక్క రాష్ట్రం నుంచి ధాన్యం తెస్తున్నారని కేంద్రం చెబుతుండడం దౌర్భాగ్యమన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా తీర్మానాల ద్వారా వడ్లు కొనుగోళ్లు చేయాలని కేంద్రానికి పంపించామని, ఆయనప్పటికీ మోదీలో చలనం రాకపోతే భవిష్యత్తులో మరో ఉద్యమం తప్పదని మంత్రి వేముల చెప్పారు. పిడికిలి మందితో మొదలైన తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రం వరకు చేరిందని, కేసీఆర్ సారథ్యంలో రైతుల కోసం అదే తరహా పోరాటం వస్తుందన్నారు. మొన్నటి వరకు వరి వేయాలంటూ రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మంత్రి ప్రదర్శించారు. ఇప్పుడు ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పోచంపాడ్లోకి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు తేవడం, వాగులు, వంకల్లో చెక్డ్యామ్ల నిర్మాణం, చెరువులు బాగు చేసుకోవడం, ఇలా అనేక పనుల ద్వారా వ్యవసాయం వృద్ధిలో వచ్చి తెలంగాణ నేడు దేశానికి అన్నం పెడుతున్నదని మంత్రి చెప్పారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీలు పలు శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. మన ఊరు- మన బడిలో ఇష్టానుసారంగా అంచనాలు రూపొందించడం సరికాదని మంత్రి చెప్పారు. కింది స్థాయి అధికారులపై జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని పంచాయతీ రాజ్ ఈఈపై మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పండించిన ప్రతి పంటనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతులు కష్టపడి పండించిన పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ జడ్పీ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశాం.
– దాదన్నగారి విఠల్రావు, జడ్పీ చైర్మన్, నిజామాబాద్
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించడానికి జడ్పీటీసీ సభ్యులకు అధ్యయన యాత్ర ఏర్పాటు చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఈ పంట సాగు విధానాన్ని పరిశీలించేలా చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ కూలీలకు విరివిగా పనులు కల్పిస్తూ ఇప్పటి వరకు రూ.82 కోట్ల వేతనాలను పంపిణీ చేశాం.
– నారాయణరెడ్డి, కలెక్టర్, నిజామాబాద్
ప్రభుత్వ దవాఖానలో మోకాళ్ల మార్పిడి చికిత్సను ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ దవాఖానలో కూడా ఈ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
-వీజీగౌడ్, ఎమ్మెల్సీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యంమివ్వడం సంతోషంగా ఉంది. కానీ వాటిని పరిశుభ్రంగా ఉండేలా చూడడంతోపాటు పర్యవేక్షణకు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలి.
-రాజేశ్వర్ రావు, ఎమ్మెల్సీ