భీమ్గల్, సెప్టెంబర్ 13 : విద్యార్థుల విషయంలో నిర్ల క్ష్యం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన భీమ్గల్ కస్తూర్బా పాఠశాలను మంత్రి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాల పరిసరాలు, వంటగది, టాయిలెట్స్, స్టోర్రూమ్లను పరిశీలించారు. విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించా రు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్వోప్లాంట్ ద్వారా తాగునీరు అందుతుందా అని విద్యార్థినులను అడగ్గా.. వారు అందుతుందని బదులిచ్చారు. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తానని బాగా చదువుకోవాలని విద్యార్థినులకు భరోసా కల్పించారు. ఫుడ్పాయిజన్కు గల కారణాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, పప్పులు, బియ్యం శుభ్రంగా ఉంచాలని, మన ఇంట్లో పిల్లలకు ఎలాగైతే చూసుకుంటామో వారిని కూడా అలాగే చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని మంత్రి హెచ్చరించారు. మెనూ ప్రకారం శుభ్రమైన పౌష్టికాహారాన్ని వారికి అందించాలన్నారు. తాను మళ్లీ ఆకస్మిక తనిఖీలకు వస్తానన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాస్థాయి అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.
వంటగది, స్టోర్రూం, బాత్రూంలు పరిశుభ్రంగా ఉండడానికి చేయాల్సిన చిన్నచిన్న పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచే కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థినులకు నాణ్యమైన విద్య, వసతి, పౌష్టికాహారం అందిస్తున్నదని, విద్యార్థుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి వెంట ఆర్డీవో వినోద్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలతా సురేందర్, జడ్పీటీసీ రవి, తహసీల్దార్ వెంకటరమణ, వైస్చైర్మన్ భగత్, సొసైటీ చైర్మన్ నర్సయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మానాయక్, కౌన్సిలర్లు లింగయ్య, నర్సయ్య, సతీశ్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.