భీమ్గల్, మార్చి 19: ప్రతిపేదకూ సొంతిల్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామంలో రూ.7.77 కోట్లతో నిర్మించిన112 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని (కేసీఆర్ కాలనీ) ఆదివారం ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేసి, వారితో గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారం చేయాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నారని అన్నారు.
ఇలాంటి కార్యక్రమం దేశంలోనే మరెక్కడా లేదని తెలిపారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టినట్లు స్పష్టం చేశారు. తాను ఇచ్చిన పిలుపుతో బడాభీమ్గల్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఒక్కరూ కూడా తమకు ఇల్లు కావాలని తనను అడగలేదన్నారు. అర్హులైన పేదవారికి అందేలా చూశారన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల క్రమశిక్షణకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. సొంత జాగ ఉన్నవారిలో అర్హులకు త్వరలోనే రూ. 3లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 1500 ఇండ్లు నిర్మించామని, మరో 1500 త్వరలో నిర్మించి ఇస్తామన్నారు. ఇల్లు రాని వారెవరూ నిరాశ చెందవద్దని, అర్హులైన ప్రతిఒక్కరికీ ఇల్లు వస్తుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో కాగితాల మీదే ఇండ్లు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్లు కాగితాల మీదనే ఉండేవన్నారు. లబ్ధిదారుల పేరు మీద వచ్చిన డబ్బులను కాంగ్రెస్ నాయకులు వారి జేబులో వేసుకునేవారని, ఒకవేళ ఇండ్లను ఇచ్చినా వారి బంధువులకే ఇచ్చుకున్నారని ఆరోపించారు. నేడు కేసీఆర్ కట్టించిన ఇండ్లు కండ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఒక్కో ఇంటికి రూ.75 వేలు ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం ఇంటి జాగా ఖర్చు, అన్ని వసతులతో కలిపి రూ.10 లక్షల విలువ గల ఇల్లు అందిస్తున్నదని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏవని మొరిగిన రేవంత్రెడ్డి.. బడాభీమ్గల్కు వచ్చి చూడాలని సూచించారు. ఆయనవన్నీ దొంగ మాటలని, ఆయన వెంట ఉన్నవారంతా ప్రజల డబ్బులను జేబులో వేసుకున్న దొంగలే అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు .. కాంగ్రెస్ కట్టించిన 10 ఇండ్లతో సమానమన్నారు.
మోదీ రూపాయి ఇవ్వలే..
మోదీ ప్రభుత్వం మాటలు తప్ప, రూపాయి సాయం లేదన్నారు. బాల్కొండలో కట్టిన ప్రతి డబుల్ బెడ్రూం ఇల్లు సీఎం కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో నిర్మించిందే అని స్పష్టం చేశారు. ప్రధాని ఆవాస్ యోజన కింద ప్రతి ఇంటికీ రూ. 72 వేలు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇంటి మీద కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసిందని తెలిపారు.
బాండ్ పేపర్ విలువను పోగొట్టిన ఎంపీ అర్వింద్
పసుపు బోర్డు పేరుతో రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన ఎంపీ అర్వింద్..బాండ్ పేపర్కున్న విలువను పొగోట్టాడని ఎద్దేవా చేశారు. రైతుబంధును కాపీ కొట్టి ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలో ఎంతమందికి వచ్చిందని, ఇప్పుడు ఎంత మందికి వస్తుందో అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు కింద కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నారని, ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుండగా..ప్రధాని కిసాన్ యోజన లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోందన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, తనను ఫేస్బుక్ వేదికగా తరచూ తిట్టే అర్వింద్.. అదే వేదికగా తన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.
మోదీని కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు
మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అదానీ లాంటి కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని, ఆ మాఫీ చేసిన డబ్బులతో బీజేపీ ప్రత్యర్థి రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అక్కడి ప్రభుత్వాలను కూలదోస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్రలు చేస్తే కేసీఆర్ అడ్డు పడ్డారన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు రెట్టింపు చేశారని, దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతున్నదన్నారు. పేదలు, రైతులను పీడిస్తూ, తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్న మోదీని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, అందుకే కేసీఆర్ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నారని అన్నారు.
అదానీ మీద సమగ్ర విచారణ చేపట్టాలి..
లక్షల కోట్లు దోచుకున్న మోదీ దోస్త్ అదానీ మీద సమగ్ర విచారణ చేయాలని పార్లమెంట్లో ప్రతి ఎంపీ డిమాండ్ చేస్తున్నాడని, దానిపై ఎలాంటి స్పందన లేదన్నారు. ఎల్ఐసీ, ఎస్బీఐలో ప్రజలు దాచుకున్న డబ్బులను మాయం చేసిన అదానీ మీద విచారణ చేపట్టరని, కానీ సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వ కక్ష పూరిత వైఖరిపై మంత్రి వేముల మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి గడపకూ కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని తెలిపారు. ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు మాటలు చెబుతున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. రైతులు, పేదప్రజల పక్షాన నిలబడ్డ కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కేంద్రం తీరుపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మొయిజ్, ఆర్డీవో శ్రీనివాసులు, డీసీవో సింహాచలం, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, వైస్ ఎంపీపీ బావాయి, సర్పంచ్ సంజీవ్, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పసుల ముత్తెన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సురేందర్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో రాజేశ్వర్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి మోర్తాడ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
కవితమ్మకు అండగా నిలబడుదాం
భీమ్గల్, మార్చి 19: మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకు కక్షగట్టి ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ను మోదీ ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అక్రమ కేసులు పెట్టించి తమదారికి తెచ్చుకోవాలని చూస్తున్నారన్నారు. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కాజేసిన అదానీపై చర్యలేందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవితమ్మకు అండగా మనందరం నిలబడాలని, చేతులెత్తి మద్దతు తెలుపాలని కోరగా.. సభలోని మహిళలు, ప్రజలు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ చప్పట్లు కొట్టి, చేతులెత్తి కవితకు సంపూర్ణ మద్దతు తెలిపారు.