భీమ్గల్, నవంబర్ 6: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మనుసు పెట్టి పనిచేసి నెరవేర్చానని.. మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి వేముల భీమ్గల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డిని ఆశీర్వదిస్తూ నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ప్రజలనుద్దేశించి ముచ్కూర్ ఎక్స్రోడ్డు వద్ద మంత్రి ప్రసంగించారు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తే వారే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. తనను ఆశీర్వదించడానికి వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులే ఇందుకు నిదర్శమని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, సాగునీటి రంగంలో విజయం సాధించినప్పుడు తనకు కలిగిన ఆనందం వర్ణించలేనిదని ఉద్వేగంగా చెప్పారు. ఈ అభివృద్ధి పనులన్నీ తన జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టాలని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో రూ.2కోట్లతో పునర్జీవ పథకం పూర్తిచేసి వరద కాలువ ద్వారా కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీలో నింపి చూపించామన్నారు. దీంతో గుత్ప, హన్మంత్రెడ్డి, నవాబ్ ఎత్తిపోతల పథకాలకు, నియోజకవర్గంలో కొత్తగా 80వేల ఎకరాలకు సాగునీటిని అందించే ప్యాకేజ్ -21 పథకానికి సమృద్ధిగా నీరు లభించేలా చేశామన్నారు.
కప్పలవాగు, పెద్దవాగుల్లో 24 చెక్డ్యాములను సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరు చేయించుకొని 17చెక్డ్యాములను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఫలితంగా 42కి.మీ పారే ఈ వాగుల వెంట 32గ్రామాలకు సాగునీటి ప్రయోజనం కలిగిందన్నారు. కప్పలవాగులో కాళేశ్వరం జలాలను పారించి సాగునీటికి సరికొత్త భరోసాను అందించామన్నారు. కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకొని రైతుల కరెంటు కష్టాలను దూరం చేశామన్నారు. భీమ్గల్ పట్టణం గతంలో ఎట్లుండే.. ఇప్పుడు ఎలా ఉందో.. అభివృద్ధి ప్రజల కండ్లముందే ఉన్నదన్నారు. రూ.150కోట్లతో సెంట్రల్ లైటింగ్, నాలుగు లైన్ల రోడ్లు , గల్లి గల్ల్లీలో సీసీ రోడ్లు, ప్రధాన మార్గాల్లో బీటీ రోడ్లు వేయించి, అన్నివర్గాల శ్మశాన వాటికలను సౌకర్యవంతంగా తీర్చిదిద్ది, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టి భీమ్గల్ పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేసినట్లు వివరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టకు రూ.3.50కోట్లతో డివైడర్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గిరి ప్రదక్షిణ రోడ్డు సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేశామన్నారు. ఇవన్నీ తన జీవితంలో మర్చిపోలేని ఘట్టాలని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలను సైతం ఇదే కమిట్మెంట్తో పనిచేసి నెరవేరుస్తానని అన్నారు. హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి స్టీల్ పైప్లైన్ వేయిస్తానని, లింబాద్రి గుట్ట క్షేత్రాన్ని ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని, నియోజకవర్గ కేంద్రమైన బాల్కొండను అక్కడి ప్రజలకు ఇష్టమైతే.. మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ అంశాలను ఇటీవల వేల్పూర్కు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్కు తాను విన్నవించగా కేసీఆర్ అభయం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో సకల జనుల సంక్షేమానికి వరంలాగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డి.రాజేశ్వర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలతాసురేందర్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.