భీమ్గల్/వేల్పూర్, నవంబర్ 7: తనను మరోసారి ఆశీర్వదిస్తే మరో ఐదేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అమలుకు నోచుకోని పథకాలు తెలంగాణలో ఇస్తామనం విడ్డూరంగా ఉందన్నారు. ఆ పార్టీ మాయ మాటలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. మంగళవారం ఆయన వేల్పూర్, భీమ్గల్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం వేల్పూర్ మం డలం కుకునూర్, కోమన్పల్లి, వెంకటాపూర్, సాయంత్రం భీమ్గల్ మండలంలోని బాబానగర్, బాబాపూర్, పురాణీపేట్ గ్రామాల్లో పర్యటించారు. మంత్రికి ఆయా గ్రామాల్లో బోనాలు, మంగళహారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వేముల మాట్లాడుతూ.. వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్పల్లి, వెంకటాపూర్ గ్రామాలతో తనకు అవినాభావ సంబంధం ఉన్నదని, తన తండ్రి వేముల సురేందర్రెడ్డి ఈ గ్రామాల్లో ప్రతి ఇంటి వారిని పేరు పెట్టి పిలిచేంత ఆత్మీయ సంబంధాలు ఉండేవని గుర్తుచేశారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూడా ఇవ్వడం లేదన్నారు.
కర్ణాటకలో రూ. 700 పింఛన్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ..తెలంగాణలో రూ. నాలుగు వేలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవో ప్రజలు ఆలోచించాలని కోరారు. తాను చెప్పేది అబద్ధమైతే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాస్తానన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1250 రూపాయలకు పెంచారని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాక నాలుగు వందలకే సిలిండర్ అందజేస్తారని, మిగిలిన డబ్బులను మోదీ సర్కారుకు కేసీఆర్ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ సాయం వందలాది మందికి అందించామని, పీఎంఆర్ఎఫ్ నుంచి బీజేపీ ఎంపీ అర్వింద్ ఎంతమందికి ఎంత డబ్బు ఇప్పించారో చెప్పాలన్నారు. గుడ్డిగా బీజేపీ మాయమాటలకు లోను కావద్దని యువతకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా తాను చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోయి, తరతరాలకు ఉపయోగపడుతాయన్నారు. బాల్కొండ నియోజకవర్గాన్ని పచ్చగా ఉంచుతానని అన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, సర్పంచులు రాము లు, అతీఖ్, శంకర్, ఎంపీటీసీలు సుర్జీల్, సాయి ప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.