భీమ్గల్, జూన్ 8: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ స్వల్ప వ్యవధిలో పల్లెపల్లెనా సమృద్ధిగా నీటి వనరులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక స్వల్ప వ్యవధిలో తాగు, సాగునీటి ఇక్కట్లను దూరం చేశారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పురాణీపేట గ్రామశివారులో ఉన్న చెన్న చెరువు వద్ద గురువారం ఊరూరా చెరువుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హాజరయ్యారు. గ్రామ కూడలి నుంచి మంత్రి, కలెక్టర్కు గ్రామస్తులు బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగ తం పలికారు. చెరువు కట్టపై ఉన్న మైసమ్మ వద్ద ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సమైక్యపాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంత చెరువులు బీటలు వారి కనిపించేవన్నారు. బోరుబావులు వట్టిపోయి కరెంట్ కష్టాలతో రైతులు ఇబ్బందులు పడేవారని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చేదన్నారు. చెరువుల్లో నీళ్లుంటే అందరి బతుకులు బాగుపడుతాయన్నారు. రైతులకే కాకుండా రజకులు, మత్స్య కార్మికులకు ఉపాధి మెరుగుపడుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువుల్లో పూడికతీత, మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. దాని ఫలితంగానే మండుటెండల్లోనూ చెరువులు జలకళ సంతరించుకొని అలుగులు పారుతున్నాయని అన్నారు.
పెరిగిన భూగర్భ జలాలు
ప్రాజెక్టులు, ఎత్తిపోత పథకాలు, చెక్డ్యాంల నిర్మాణాలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 16 చెక్డ్యాంలు నిర్మించామని, మరో ఏడు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఎస్సీరెస్పీ ఏడాదిపొడుగునా జలకళతో ఉండాలని పునరుజ్జీవ పథకం కింద రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలను మళ్లించినట్లు తెలిపారు. ప్రతి ఎకరాకు గోదావరి జలాలు అందేలా 21వ ప్యాకేజీ పనులను రూ.1700 కోట్లతో చేపట్టామని, త్వరలో పనులు పూర్తవుతాయన్నారు. మరోపక్షం రోజుల్లో కప్పల వాగులోని నీటిని మళ్లీస్తామన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి.. సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీవో సింహాచలం, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి, కో-ఆప్షన్ మెం బర్ మోయిజ్, చేయూత స్వచ్ఛంద వ్యవస్థాపకుడు డాక్టర్ మధుశేఖర్, ముచ్కూర్ విండో చైర్మన్ మలావత్ వెంకటేశ్, సర్పంచ్ తోట శంకర్, ఎంపీటీసీ సాయి ప్రసన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గాంధీ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.