భీమ్గల్, ఏప్రిల్ 16: బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, పార్టీకి వారే బలం, బలగమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్లో బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించగా.. మంత్రి వేముల తన సతీమణి నీరజారెడ్డితో హాజరయ్యారు. చిన్నా పెద్ద తేడా లేకుండా పార్టీ శ్రేణులు కుటుంబ సమేతంగా రావడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
సమావేశ ప్రాంగణంలో కలియదిరుగుతూ కార్యకర్తలను ఆత్మీయంగా పలుకరిస్తూ ముందుకుసాగారు. వారి మంచి చెడులు తెలుసుకుంటూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు మంత్రితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మంత్రి ఓపిగ్గా కార్యకర్తల కుటుంబాలతో ఫొటోలు దిగి వారిలో నూతనోత్తేజాన్ని నింపారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో 50 ఏండ్లలో జరిగిన అభివృద్ధికి నాలుగు రెట్లు అధికంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎనిమిదేండ్లలో చేసి చూపించామన్నారు. కాదని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సవాల్ చేశారు. సాగునీటి కోసం రూ.150 కోట్లతో 22 చెక్ డ్యాములను నిర్మించినట్లు తెలిపారు.
ప్రజల ఆశీస్సులతోనే నేడు తాను ఇలా ఉన్నానని, కేసీఆర్తో తనకున్న సాన్నిహిత్యం, ఆయన చొరవతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని వివరించారు. మండలంలోని పలు గ్రామాలకు సంక్షేమ ఫలాలు అందించామన్నారు. మొత్తం 13,187మందికి రూ.150 కోట్లకుపైగా నేరుగా లబ్ధి చేకూరిందని వెల్లడించారు.
కేంద్రం అరకొర సాయం
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ప్రతి ఏటా లబ్ధిదారు రైతుల సంఖ్య పెంచుతూ ఆ మొత్తాన్ని ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సంఖ్యను తక్కువ చూపెడుతూ తక్కువ మంది రైతులకు అరకొర సాయం అందిస్తూ గొప్పలకు పోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం సగానికి సగం లబ్ధిదారులైన రైతుల సంఖ్యను తగ్గించి రూ.50 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ మాడల్ పాలన కావాలని అన్ని రాష్ర్టాల ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని తెలిపారు. కేసీఆర్ పాలన కావాలని, ఆయన నాయకత్వం వహించాలని యావత్ దేశం ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు.
మోదీ మెడలు వంచాల్సిందే..
ప్రధాని మోదీ అవినీతిని కేసీఆర్ ప్రశ్నిస్తుండడంతో ఆయన బిడ్డ కవితను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణల పేరిట మోదీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ అరాచక పాలన అంతం కావాలంటే కేసీఆర్, కవితకు అండగా నిలవాలని, మోదీ మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, రైతు నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయీజ్, ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ శివసారి నర్సయ్య, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పసుల ముత్తెన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్, వైస్ ఎంపీపీ చింతకింది బావాయి, సర్పంచులు సంజీవ్, చిన్నారెడ్డి, మానస , అనసూయ, ఎంపీటీసీలు సాయి ప్రసన్నా రాజేశ్వర్, గజేందర్గౌడ్, ప్రమీల, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.