నిజామాబాద్: జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో ప్యాకేజీ 20,21,21ఏ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్యాకేజ్ 20, 21,21ఏ ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల మెట్ట భూములకు సాగునీరు ఇచ్చే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
ఈ నియోజకవర్గాల పరిధిలోని మెట్ట ప్రాంత భూములకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ బినోల నుండి టన్నెల్ ద్వారా నీటిని తీసుకొచ్చి సారంగాపూర్ పంపు హౌస్ ద్వారా నీటిని పంపిణీ చేయడానికి పనులు పూర్తి అయ్యాయి. సారంగాపూర్ పంప్ హౌస్ వద్ద మోటార్లు బిగించి రెండు నెలల్లో వెట్ – రన్ చేయడానికి పనులు కొనసాగుతున్నాయి. అక్కడి నుండి పాత నిజాంసాగర్ కెనాల్ నుండి నీటిని ఎత్తిపోసి ఒక లైన్ మంచిప్ప చెరువుకు, మరో లైన్ మెంట్రాస్ పల్లి పైప్లైన్ ద్వారా నీటి పంపిణీ చేస్తారు.
మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ నుండి ఆర్మూర్, బాల్కొండ, మెట్పల్లికి నీటిని పంపడం జరుగుతుందని, ఈ పంపుహౌస్ పనులు పూర్తి అయ్యి ఒక నెలలో వెట్ రన్ చేయడానికి సిద్ధంగా ఉంది. మెంట్రాజ్ పల్లి నుండి తొమ్మిది ఫీట్ల వెడల్పు గల ఎంఎస్ పైప్ లైన్ తో ఆర్మూర్, బాల్కొండ, మెట్పల్లి ప్రాంతాలకు మెయిన్ నీరు పంపించడం జరుగుతుంది. మెయిన్ పైప్ లైన్ లో 88 కిలోమీటర్లకు గాను 80 కి.మీ మేర పనులు పూర్తవగా, మిగతా సబ్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి.
ఈ పనులు గత సీజన్లోనే పూర్తి చేసి 20వేల ఎకరాలకు నీటిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కరోనా వల్ల పనులకు ఆటంకం కలిగిందని అధికారులు వివరించారు. జనవరి నెలలో మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ నుండి జక్రాన్ పల్లి మండలం 14 గ్రామాలలోని 14 వేల ఎకరాలకు, వేల్పూర్ మండలం నాలుగు గ్రామాలలోని ఆరు వేల ఎకరాలకు, ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం మొత్తం 20 వేల ఎకరాలకు నీటిని అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు.
గడ్కోల్ వెళ్లే పైప్ లైన్ లో మాసాని చెరువు నుండి మంచిప్పకు వెళ్లే లైన్ లో టన్నెల్ పనులు, అప్రోచ్ కెనాల్ పనులు పూర్తి అయ్యాయని, ఫీడర్ హౌస్ పనులు నవయుగ కంపెనీ నిర్వహిస్తోందని, ఆగస్టులో మంచిప్ప చెరువులో నీరు పోసే విధంగా పనులు సాగుతున్నాయని వివరించారు. అదేవిధంగా మంచిప్ప నుండి నీటిని ఎత్తిపోయటానికి రెండో పంప్ హౌస్ పనులు కూడా కొనసాగుతున్నాయని, ఆగస్టు నెలలో నీటిని బయటకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నామని చెప్పారు.
ఈ కార్యక్రమాలన్నీ రైతులకు సాగునీరు అందించడానికి ఉద్దేశించినందున రైతులు అధికారులకు పైప్ లైన్లు వేయడానికి సహకరించాలని కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి వంద ఎకరాలకు ఒక ఓఎంఎస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ మెయిన్ పాయింట్ వరకు పైప్ లైన్ వేసేలా రైతులు సహకరించాలి అని ఓఎంఎస్ నుండి కిందికి నీళ్లు తీసుకెళ్లే పైప్ లైన్ పనులు రైతులు అవసరం ఉన్నవారు వేసుకోవచ్చని ఆయన వివరించారు.
కావున వీడీసీలు, రైతులు ప్రజా ప్రతినిధులు సహకరించి అందరి భూములకు నీటిని తీసుకెళ్లడానికి పనులు జరిగేలా చూడాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రావు, ఆర్ డి ఓ రవి, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.