కమ్మర్పల్లి, ఏప్రిల్ 9: కార్యకర్తలే తన కుటుంబమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడలేని రోజు అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పకుంటానే తప్ప.. కార్యకర్తలను విస్మరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. కమ్మర్పల్లి మండలంలోని కోనాసముందర్ క్లస్టర్-2 గ్రామాలైన కోనాసముందర్, కోనాపూర్, నర్సాపూర్, ఇనాయత్నగర్, అమీర్నగర్, మానాల దాని పరిధిలోని ఎనిమిది తండా పంచాయతీల బీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి వేముల సతీమణి నీరజారెడ్డి, జిల్లా ఇన్చార్జి బండ ప్రకాశ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మోదీ తన కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశాడన్నారు. ఆ డబ్బులతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయి దొరికిపోయిన ఉదంతం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 12 రాష్ర్టాల్లో ఇలా ప్రభుత్వాలను కూల్చారన్నారు. అలాంటి మోదీ అవినీతి గురించి మాట్లాడడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పరిపాలన, నాయకత్వాన్ని యావత్ దేశం ఆహ్వానిస్తోందన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం మహారాష్ట్ర ప్రజలు కదులుతున్నారన్నారు. వారికి కనిపించిన కేసీఆర్ సుపరిపాలన రేవంత్ రెడ్డి, బండి సంజయ్కు కనిపించకపోవడం బాధాకరమన్నారు. కుటుంబ పాలన అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు అవివేకమైనవని కొట్టిపారేశారు.అమెరికాలో ఉద్యోగాలను వదిలేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కేటీఆర్, కవిత ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లో ఉన్నారని..ప్రజలు వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం..బలగమని మంత్రి వేముల అన్నారు. కార్యకర్తలే తన కుటుంబమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో 60 ఏండ్లలో లేని అభివృద్ధిని కేవలం ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో సాధ్యం చేసి చూపించామన్నారు. బాండ్ పేపర్ అర్వింద్ ప్రజలను, రైతులను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో ఊరూవాడా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రజలు మనల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారనే విశ్వాసం తనకు వంద శాతం ఉందన్నారు. కోనాసముందర్లో ఇప్పటి వరకు 86మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.46 లక్షలు ఇప్పించానని వివరించారు. కల్యాణలక్ష్మి కింద రూ.1.48కోట్లు, 1029 మందికి పింఛన్ల కోసం ప్రతినెలా రూ.15 లక్షల 27 వేలు అందుతున్నాయన్నారు.
రైతుబంధు కింద 66 మంది రైతులకు రూ.4.6 కోట్లు వచ్చాయన్నారు. గ్రామంలో 2900 మంది ఓటర్లుంటే అందులో 2614 మందికి కేసీఆర్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. మిగతా వారికి సైతం కేసీఆర్ అందిస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మేలు చేకూరిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో మంత్రి వేముల, ఆయన సతీమణి నీరజా రెడ్డి ఫొటోలు దిగారు.పేరు పేరునా పలుకరిస్తూ బాగోగులు తెలుసుకున్నారు.వారి పిల్లలను ఎత్తుకొని ముద్దాడారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మధుశేఖర్, మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఎంపీపీ లోలపు గౌతమీసుమన్, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధారాజా గౌడ్, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, సర్పంచులు ఇంద్రాల రూపారాజు, పెండె ప్రభాకర్, లస్కర్, పుప్పాల గంగాధర్, దయా దేవయ్య, గుగులోత్ భాస్కర్, లకావత్ చిన్ని, ఎంపీటీసీలు బుస్సపురం సుప్రియ, లకావత్ గంగాధర్, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బద్దం చిన్నారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ మలావత్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.