కామారెడ్డి,నవంబర్ 5: తెలంగాణ ప్రభుత్వంలో గౌడ కులస్తులకు మంచిరోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ గౌడలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకాఎల్లమ్మ కల్యాణ మండపంలో కామారెడ్డి నియోజకవర్గ గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోటీ చేయడంతో కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తే గజ్వేల్లో ఎంత అభివృద్ధి జరిగిందో.. దానికి మించి కామారెడ్డి అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్తో పనిలేకుండా కోరుకున్నవన్నీ వస్తాయని వివరించారు. గౌడ కులస్తుల భవనానికి 5ఎకరాలు కాదు.. 10 ఎకరాలు వస్తాయని అన్నారు. కేసీఆర్ గెలుపుతో కామారెడ్డి మరింత సస్యశ్యామలమవుతుందని తెలిపారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని కేసీఆర్ని కొనియాడారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను అవమానించాయని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి రోజులు వచ్చాయన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత గౌడ కులస్తులపై ఎలాంటి దాడులు జరగలేవని అన్నారు. మామూళ్లు ఇవ్వకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్ కల్పించిన మహానేత కేసీఆర్ని పేర్కొన్నారు. ప్రతి ఒక్క గౌడ కులస్తుడు మండలాలు, గ్రామాల వారీగా ప్రచారం నిర్వహించి సీఎం కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని అన్నారు. ఉద్యమంలో అన్ని రకాలుగా ఆదుకున్నది.. గౌడకులస్తులేనని గుర్తుచేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించినట్లు తెలిపారు.తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేశానని, కామారెడ్డి మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు వస్తేనే అభివృద్ధి చెందుతుందని తానే కేసీఆర్ను ఆహ్వానించినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే కామారెడ్డి జిల్లా ఏర్పడిందని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచేందుకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపీగౌడ్, చక్రవర్తి గౌడ్, ఎంజీ వేణుగోపాల్ గౌడ్, హరిశంకర్ గౌడ్, మోతె బాల్రాజ్ గౌడ్, గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.