నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు. మోర్తాడ్లో న్యాక్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కమ్మర్పల్లిలో కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హాసాకొత్తూర్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారని.. వారికి ఏది అవసరమో అదే చేస్తారన్నారు. కాంగ్రెస్ మాదిరిగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వరన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్లు డబ్బాల్లో పడ్డాక ముఖం కూడా చూపించరని విమర్శించారు. వారివి మభ్య పెట్టే హామీలని , వారి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. కేసీఆరే తెలంగాణకు శ్రీ రామ రక్ష అని పునరుద్ఘాటించారు.
కమ్మర్పల్లి/ మోర్తాడ్, సెప్టెంబర్ 27 : బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో రూ. కోటికి తగ్గకుండా సీసీ రోడ్లు వేసినట్లు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలంలో పర్యటించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మోర్తాడ్లో రూ. 5 కోట్లతో చేపట్టనున్న న్యాక్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కమ్మర్పల్లి, హాసాకొత్తూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి వేముల మాట్లాడుతూ..కరోనా కష్ట కాలంలో సైతం పెన్షన్లు అందజేసిన మొనగాడు సీఎం కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్కు పేదలపై ఉన్న ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు. ప్రజలకు ఏది అవసరమో కేసీఆర్ అదే చేస్తారని, చేయగలిగిందే ప్రకటిస్తారని తెలిపారు. కాంగ్రెస్ మాదిరిగా సాధ్యం కాని హామీలు ఇవ్వబోరన్నారు.
పదేండ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. తొమ్మిదేండ్లలో కమ్మర్పల్లి అభివృద్ధి కోసం రూ. 90 కోట్లు, హాసా కొత్తూర్ అభివృద్ధికి రూ. 43 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన ఎంపీ అర్వింద్ కమ్మర్పల్లికి ఏం చేశారని నిలదీశారు. హన్మంత్ రెడ్డి లిఫ్టును 24 గంటల కరెంటుతో ఏడాదిలో ఎనిమిది నెలలు నింపించుకునేలా చేశామని.. తద్వారా ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్లు డబ్బాల్లో పడ్డాక ముఖం కూడా చూపించరని విమర్శించారు. వారివి మభ్య పెట్టే హామీలని, వారి మాటలను న మ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్, బీజేపీకి హైకమాండ్ ఢిల్లీలో ఉంటే కేసీఆర్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని పేర్కొన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పునరుద్ఘాటించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగుతున్నదని మంత్రి వేముల అన్నారు. ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రాపాలకులను ఎదురించి మలిదశ ఉద్యమానికి నీడను ఇచ్చిన ధీశాలి బాపూజీ అని కొనియాడారు. పద్మశాలీలు తనను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారని, బాపూజీ విగ్రహావిష్కరణకు తనను ప్రత్యేకంగా పిలిచి గౌరవించారన్నారు. రానున్న రోజుల్లో పద్మశాలీల అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానన్నారు.
బాల్కొండ నియోజకవర్గ యువత భవిష్యత్తు కోసమే మోర్తాడ్లో న్యాక్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.ఈ కేంద్రంలో హాస్టల్ వసతితో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తారని చెప్పారు.ఇక్కడ శిక్షణ తీసుకున్న యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.