రెండు నెలలు కష్టపడితే… చింతలేని జీవితం మీ సొంతం
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియళ్ల పంపిణీ
ఉద్యోగార్థులు రెండు నెలలు కష్టపడి చదివితే 40 ఏండ్ల జీవితాన్ని హాయిగా గడపవచ్చని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం హనుమాన్నగర్లోని శిక్షణా శిబిరంలో గురువారం అభ్యర్థ్థులకు ఆయన స్టడీ మెటీరియళ్లను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లా యువతకు కొలువులు దక్కాలనే సంకల్పంతో ఖర్చు గురించి ఆలోచించకుండా కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. యువతీయువకులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి రిటర్న్ గిఫ్ట్ అందించాలని సూచించారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోనూ అత్యధిక ఉద్యోగాలు సాధిస్తే తాము పడిన శ్రమకు ఫలితం దక్కుతుందన్నారు.
వేల్పూర్, మే 26: యువతీయువకులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి రిటర్న్ గిఫ్ట్ అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. రెండు నెలలు కష్టపడి చదివితే 40 ఏండ్ల జీవితాన్ని హాయిగా గడపవచ్చన్నారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బాల్కొండ నియోజకవర్గంలోని యువతీయువకుల కోసం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన సొంత ఖర్చులతో వేల్పూర్ మండలం హనుమాన్ నగర్ గ్రామంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శిక్షణ శిబిరంలో ఉద్యోగార్థులకు మంత్రి ..కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి గురువారం స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. దేశంలోనే మరెక్కడా లేని విధం గా ఒకేసారి దాదాపు 90వేల ఉద్యోగాల భర్తీ కోసం జంబో నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంతో పాటు జిల్లా నుంచి అత్యధిక మందికి ప్రభుత్వ కొలువులు దక్కాలనే సంకల్పంతో ఖర్చు గురించి ఆలోచించకుండా కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లకు దీటుగా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకుంటున్న ఉద్యోగార్థులకు ఉచిత భోజనంతోపాటు నాణ్యమైన స్టడీ మెటీరియల్ను అందజేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో జోనల్ విధానాన్ని పాటించడంతో తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరిగిందన్నారు.దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేశారని గుర్తుచేశారు. ఫలితంగా స్థానికులకు 95శాతం ఉద్యోగాలను ఖరారు చేస్తూ జీవోను జారీ చేయడం సాధ్యపడిందని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన అభ్యర్థులు స్థానిక కోటాతో పాటు జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోనూ ఎక్కువగా ఉద్యోగాలు సాధిస్తే తాముపడిన శ్రమకు ఫలితం దక్కిందనే సంతృప్తి మిగులుతుందన్నారు. జి ల్లాకు కనీసం మూడు వేల కొలువులు సాధించి నిజామాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తూ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచాలని కోచింగ్ కేంద్రాల సమన్వయకర్త చక్రవర్తికి మంత్రి సూచించారు.
సబ్జెక్టులపై పట్టుసాధిస్తే విజయం మీదే : కలెక్టర్ నారాయణరెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉద్యోగ పోటీ పరీక్షల కోచింగ్ అంటే హైదరాబాద్లో మాత్రమే ఉండేదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రస్తుతం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవతో స్థానికంగానే యువతకు అన్ని వసతులతో కూడిన శిక్షణ అందుతుండడం అదృష్టంగానే భావించాలన్నా రు. ప్రతి ఒక్కరూ ఏర్పర్చుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టపడడం తప్ప అడ్డదారులు ఉండవన్నారు. సబ్జెక్టులపై పట్టు సాధిస్తూ, సిలబస్ మొత్తాన్ని ఆకళింపు చేసుకుంటే పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తారన్నారు. అన్ని వసతులతో కూడిన నాణ్యమైన శిక్షణ ఏర్పాటు చేయించిన మంత్రి ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పలువురు ఉద్యోగార్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఇన్చార్జి ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ ప్రభాకర్,డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఎంపీపీ జమున,ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.