సమైక్యపాలనలో శివాలయంగా ఉండేది
కేసీఆర్ దయతోనే ఎస్సారెస్పీకి పునరుజ్జీవం
రూ.40కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి
1996 నాటి చారిత్రక ఘటనను వివరించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనుల ప్రారంభం
స్వరాష్ట్రంలో ఎస్సారెస్పీ పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రూ.18కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 వరద గేట్ల మరమ్మతు పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వేముల.. రైతులు, ఇరిగేషన్ ఇంజినీర్లతో మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణలోని ప్రాజెక్టులు శివాలయాలుగా బోసి పోయి ఉంటే ఆంధ్రాలోని ప్రాజెక్టులన్నీ వైష్ణవాలయాలుగా కళకళలాడుతూ ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ కృషితో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు వైష్ణవాలయం మాదిరిగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. గడిచిన ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ రూ.40 కోట్లతో ఎస్సారెస్పీని అద్భుతంగా మలిచారన్నారు. 1996లో కేసీఆర్ మంత్రి హోదాలో స్వయంగా పోచంపాడ్ను సందర్శించారని.. ఈ పర్యటనకు సంబంధించిన చారిత్రక అంశాలను మంత్రి సభికులకు వివరించారు.
నిజామాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య పాలనలో తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ శివాలయాలుగా ఉంటే.. ఆంధ్రా ప్రాజెక్టులన్నీ వైష్ణవాలయాలుగా కళకళలాడుతూ ఉండేవని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దయతో ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు వైష్ణవాలయం మాదిరిగా రూపుదిద్దుకున్నదని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్సారెస్పీకి మరమ్మతులు, ఇతరత్రా పనుల కోసం పైసా నిధులు ఇచ్చే వారు కాదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ గడిచిన ఎనిమిదేండ్లలో రూ.40కోట్లు మంజూరు చేసి ఎస్సారెస్పీని అద్భుతంగా మలిచారని ఆనందం వ్యక్తం చేశారు. రూ.18కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 వరద గేట్ల మరమ్మతుల పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి.. రైతులు, ఇరిగేషన్ ఇంజనీర్లతో మాట్లాడారు. 1996లో కేసీఆర్ మంత్రి హోదాలో స్వయంగా పోచంపాడ్ను సందర్శించారని, నాటి పర్యటనకు సంబంధించిన చారిత్రక అంశాలను కూలంకషంగా సభికులకు వివరించారు. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా లోతైన అవగాహన, పరిశోధన చేసిన తర్వాతనే సమస్యను అర్థం చేసుకుని దాని ప్రకారం పరిపాలన ఉంటుందన్నారు. పోచంపాడ్ కట్టపై జరిగిన ఓ ఘటనను కేసీఆర్ ద్వారా తెలుసుకున్న మంత్రి ఇలా వివరించారు.
26 ఏండ్ల క్రితం ఏం జరిగిందంటే..?
1996లో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ సందర్భంలో టీడీపీ అభ్యర్థికి ఇన్చార్జిగా నిర్మల్ నియోజకవర్గానికి నాడు మంత్రి హోదాలో కేసీఆర్ వచ్చారు. ఒక రోజు ప్రచారంలో ఓ ముస్లిం బస్తీకి వెళ్లగా ఆ రోజే స్థానికంగా ఓ పెద్ద మనిషి చనిపోవడంతో ప్రచారం నిలిచిపోయింది. ఆ ఖాళీ సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి(శాసన మండలి స్పీకర్), సత్యనారాయణ గౌడ్( టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు)తో పోచంపాడ్ కట్టమీదికి కేసీఆర్ వచ్చారు. అటూ ఇటూ ప్రాజెక్టు మొత్తం పరిశీలించారు. ప్రాజెక్టు దుస్థితిని చూసిన కేసీఆర్కు కంట కన్నీరు, భావోద్వేగం తన్నుకు వచ్చి తన పక్కనే ఉన్న వాళ్లతో మన ప్రాజెక్టులు శివాలయాలుగా పాడైనయి. వాళ్ల(ఆంధ్రోళ్లవి) ప్రాజెక్టులు వైష్ణవాలయాలు ఉన్న యి. గిదేం ఖర్మ మనకు. పైసా ఇవ్వరు. మరమ్మతు లు చేయరు. గేట్లు తుప్పు పట్టినాయి. రోప్లు పాడైపోయినాయి. సిలుమ్ పట్టి ఊడేటట్లే కనిపిస్తున్నాయి. కనీసం గ్రీజ్ కూడా రాస్తలేరు కదా… కట్టమీద గుంతలు ఏంది… నాలుగు జిల్లాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు గిట్లుంటదా… మన బతకులు గిట్లా అయిపోయినాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎటు చూసినా గార్డెన్లు, లాన్లు, గెస్ట్ హౌస్లుంటాయి. ఇదేమి అన్యాయమయ్యా.. అంటూ కేసీఆర్ పడిన ఆవేదనను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కళ్లకు కట్టారు. ఈ వివక్ష గిట్లనే కొనసాగితే రేపు పొద్దున తెలంగాణ ఉద్యమం వచ్చినా… వస్తది. దానికి నేనే నాయకత్వం వహిస్తానేమో అంటూ తన భావాలను పోచంపాడ్ కట్టపైనే వెలిబుచ్చిన విషయాన్ని మంత్రి వేముల గుర్తుచేశారు. 26 ఏండ్ల క్రితం కేసీఆర్ అన్నట్లుగానే ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించారని వివరించారు.
వైఎస్ మనల్ని పిచ్చోళ్లను చేశారు…
ప్రాణహిత – చేవెళ్ల పథకం పేరుతో సమైక్య పాలనలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలను పిచ్చోళ్లను చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. చెంబెడు నీళ్లు తీసుకు రాకపోయినప్పటికీ అర్థం పర్థం లేని ప్రణాళికలను రచించారని చెప్పారు. ఎస్సారెస్పీలో 20 టీఎంసీలు కన్నా నీళ్లు తక్కువగా ఉంటేనే పంప్హౌస్లు నడిచే విధంగా కాంగ్రెస్ పాలకులు ప్లాన్ చేశారని… అప్పటికే పోచంపాడ్కు 3-4 ఏండ్లకు కూడా నీళ్లతో నిండే పరిస్థితి లేదన్నారు. శ్రీరాంసాగర్కు నీళ్లు నింపే ప్రయత్నం చేయకుండా పంప్హౌస్లు కట్టి ఏం చేయాలనుకున్నారో వారికే తెలియాలన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్కు పునర్వైభవం తెచ్చేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి హల్దీవాగు ద్వారా నిజాంసాగర్కు నీళ్లు తరలించి గ్రావిటీ ద్వారా ఎస్సారెస్పీలోకి నీళ్లు వచ్చేలా ప్రణాళికలు రచించారన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం జలాలను చుట్టూ తిప్పి తీసుకు రావడానికి బదులుగా వరద కాలువ ఆధారంగా రివర్స్ పంపింగ్ ఆలోచనను సీఎం కేసీఆర్ ఒప్పుకుని మంజూరు సైతం ఇచ్చారన్నారు. రూ.1900 కోట్లతో పునరుజ్జీవ పథకం చేపట్టి శ్రీరాంసాగర్కు నీటి కొరత లేకుండా చేయగలిగామన్నారు. తద్వారా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నిరంతరం నడుస్తున్నాయని తెలిపారు.
నేడు సుజల స్రవంతి…
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో 2017లో పోచంపాడ్ కట్టపైకి సీఎం హోదాలో వచ్చిన కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేశారని మంత్రి వేముల చెప్పారు. తద్వారా ఇప్పటి వరకు రూ.40కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.14కోట్లతో ప్రధాన రహదారి నుంచి కట్టకు బీటీ రోడ్డు నిర్మాణం, ప్రాజెక్టు కట్ట బలోపేతం కోసం రూ.8కోట్లతో పనులు జరిగాయన్నారు. ఇవాళ బాజాప్తాగా కట్టమీదికెళ్లి ఎస్సారెస్పీని చూస్తే సుందరంగా కనుల విందుగా కనిపిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. 30 ఏండ్ల క్రితం రిపేర్లు చేసిన ఎస్సారెస్పీ గేట్లు, రోప్లను బాగు చేసుకోవాలని సీఎంను నిధులు అడిగితే వెంటనే మం జూరు చేశారని వివరించారు. రూ.18కోట్లతో శంకుస్థాపన చేసుకున్న పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. ఇదంతా రైతులు తెలుసుకోవాల్సిన విషయాలన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు, రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న శ్రమను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనతి కాలంలోనే రూ.40కోట్లతో పోచంపాడ్ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం వల్లనే సాధ్యమైందన్నారు.