బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా
పర్యటించనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.53 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మంత్రికి అడుగడుగునా ఘనస్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన వీధులన్నీ గులాబీమయమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ఉదయం 11 గంటలకు కామారెడ్డికి చేరుకునే మంత్రి సుమారు 5 గంటల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.
-కామారెడ్డి (నమస్తే తెలంగాణ)/ ఎల్లారెడ్డి, ఆగస్టు 13
కామారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం కామారెడ్డి జిల్లాకు రానున్నారు. మంత్రి రాక నేపథ్యంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వరకు రోడ్డు మార్గం గుండా మంత్రి కేటీఆర్ పర్యటన సాగనుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. ఈ రోడ్డు వెంబడి గ్రామ గ్రామాన ప్రజలు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రత్యేకంగా తమ గ్రామాలను ముస్తాబు చేశారు.
కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు రూ.21 కోట్లు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుమారు రూ.32 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కామారెడ్డి పట్టణం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి నెంబర్ 44ను బైపాస్ రోడ్డుకు మార్చడంతో, 2016 నుంచి ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. డబుల్ రోడ్డు కావడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. దీంతో ఎమ్మెల్యే స్పందించి, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రూ.11 కోట్లు కేటాయించారు. ఈఎస్ఆర్ గార్డెన్ నుంచి టేక్రియాల్ వరకు ఆరులైన్ల బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేశారు. అలాగే కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశించే ముందు రూ.61 లక్షలతో నర్సన్నపల్లి వద్ద స్వాగత తోరణాన్ని అందంగా నిర్మించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్ కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వారు ఏర్పాట్లను పరిశీలించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తాడ్వాయి మండలంలో రూ.2కోట్లతో చేపట్టనున్న స్పోర్ట్స్ స్టేడియానికి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై రూ.5 కోట్లతో నిర్మించిన హైలెవల్ వంతెన, రూ.3.54 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ.80లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. పాత ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో రూ.4.20 కోట్లతో కొత్తగా నిర్మించనున్న బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పట్టణంలో రూ.10కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం రూ.2కోట్లు కేటాయించగా, ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.4కోట్లతో చేపట్టనున్న మున్సిపల్ భవనానికి భూమి పూజ చేస్తారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని కామారెడ్డి రోడ్డుపై ఉన్న జీవదాన్ స్కూల్ వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 25వేల మంది ఈ సభకు తరలిరానున్నారు. శంకుస్థాపనల అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభా ప్రాంగణానికి విచ్చేస్తారు. వారం రోజులుగా ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్థానికంగా ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
35 వేల మందితో బహిరంగ సభ
ఎల్లారెడ్డి, ఆగస్టు 13: ఎల్లారెడ్డిలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు.మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత గ్రామీణ, పేద ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురై, వెనుకబడిన ప్రాంతంలా ఉన్న ఎల్లారెడ్డి పట్టణంలో నేడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. గడిచిన ఐదేండ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు వచ్చాయన్నారు. అభివృద్ధి పనులను గమనిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా సభకు పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంచనాలకు మించి 35వేల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు జలంధర్రెడ్డి, ఆదిమూలం సతీశ్కుమార్, గాంధారి జడ్పీటీసీ శంకర్నాయక్, నాయకులు శ్రీనివాస్నాయక్, ఇమ్రాన్, నాగం సురేందర్, కపిల్రెడ్డి తదితరులున్నారు.