రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నిజామాబాద్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ను జూలైలో ప్రారంభించనున్నట్లు ఇటీవల కేటీఆరే స్వయంగా ప్రకటించారు. అలాగే, నిజామాబాద్ నగర పాలక సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, కామారెడ్డి జిల్లాలోనూ కేటీఆర్ టూర్ ఉండనున్నది. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తమ పూర్వీకుల గ్రామమైన కోనాపూర్ను కేటీఆర్ మరోసారి సందర్శించే అవకాశమున్నది. రామన్న రాక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు సమాయత్తమవుతున్నాయి.
నిజామాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు త్వరలోనే ఉమ్మడి జిల్లా పర్యటనకు రాబోతున్నారు. దీనిపై మంత్రి ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేయగా ఈ మేరకు ఏర్పాట్లు సైతం చకచకా జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, నిజామాబాద్ నగర పాలక సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. గతంలో శంకుస్థాపన చేసిన కళాభారతి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల తీరుపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇదిలా ఉండ గా కేటీఆర్ పర్యటన కామారెడ్డి జిల్లాలోనూ ఉండనున్నది. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఏక కాలంలో లేదంటే వేర్వేరుగా మంత్రి కేటీఆర్ టూర్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పూర్వీకుల గ్రామం కోనాపూర్ను మరోసారి మంత్రి కేటీఆర్ సందర్శించనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై స్థానికంగా నిర్వహించే పార్టీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఉభయ జిల్లాల్లో కేటీఆర్ టూర్ నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు.
సుందరంగా ముస్తాబైన ఐటీ టవర్…
మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రం తొమ్మిదేండ్లలో పారిశ్రామిక, ఐటీ అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఆకర్షణీయమైన పారిశ్రామిక అనుకూల విధానాలతో తెలంగాణకు దిగ్గజ పరిశ్రమలు, ఐటీ సంస్థలు అనేకం పెట్టుబడులతో వరుస కడుతున్నాయి. అంతేకాకుండా పాత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించే పనిలోనూ నిమగ్నమయ్యాయి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఐటీ కంపెనీలు తమ వ్యా పార సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ సూచనలతో హైదరాబాద్ వెలుపల ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలను స్థాపించేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోనూ నిర్మించిన ఐటీ టవర్ త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకోబోతున్నది. ఐటీ సంస్థల కార్యకలాపాలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2018, ఆగస్టు 1వ తారీఖు రోజున ఐటీ టవర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.50కోట్ల నిధులను కేటాయించారు.
కోనాపూర్కు మరోసారి…
కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కోనాపూర్ గ్రామానికి మరోసారి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. గత పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని సందర్శించేందుకు నిర్ణ యం తీసుకున్నారు. ఇప్పటికే సొంత ఖర్చులతో మంత్రి కేటీఆర్ తన నాయనమ్మ గ్రామంలో స్కూ ల్ను నిర్మిస్తున్నారు. భవన నిర్మాణ పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. గ్రామంలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సారి పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనున్నది. కేసీఆర్ సతీమణి, కేటీఆర్ తల్లి శోభ సైతం కోనాపూర్ను సందర్శించే అవకాశాలున్నట్లుగా తెలిసిం ది. కామారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బ హిరంగ సభ నిర్వహించేందుకు నేతలు సన్నాహా లు చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ కేటీఆర్ పర్యటన ఖరారయ్యే అవకాశాలున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ కోరిక మేరకు పర్యటనకు మంత్రి కేటీఆర్ అంగీకారం తెలిపారు. కేటీఆర్ సందర్శనలోనే ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలతో పాటు సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
పక్కా వ్యూహంతో…
శాసనసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైనందున బీఆర్ఎస్ పార్టీ సైతం దూకుడు ప్రదర్శిస్తున్నది. ఎన్నికల కదనరంగంలో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. నియోజకవర్గం, జిల్లా స్థాయి లో భారీ బహిరంగ సభలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను తలపెడుతున్నది. తొమ్మిదేండకల కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సాధించిన ఘనత, తీసుకు వచ్చిన పథకాలను, ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలను ప్రజలందరికీ వివరించేలా బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిరంతర పర్యటనలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నిండనున్నది. గణాంకాలతో సహా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు గత పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లడంలోనూ కేటీఆర్ ప్రసంగ శైలి ప్రజలను ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా పురపాలక సంఘాల్లో జరిగిన అభివృద్ధి తీరుతెన్నులపై ప్రజలకు అవగాహన కల్పించేలా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేలా గులాబీ పార్టీ సిద్ధమైంది.
ప్రారంభోత్సవానికి ముస్తాబు..
బీబీపేట్, జూలై 3 : బీబీపేట్ మండలంలోని కోనాపూర్ పాఠశాల రూపురేఖలు మారాయి. ఆధునిక హంగులతో సర్వాంగసుందరంగా మా రింది. మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ. 2.50 కోట్లతో పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. పాఠశాల భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. 98 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అలాగే గ్రామ శివారులో వంతెన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ రూ. 2.40 కోట్లు మంజూరు చేయడంతో ఈ పనులు పూర్తయ్యాయి.