ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఇందూరు పర్యటనకు రానున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాకు మణిహారంగా మారనున్న ‘కళాభారతి’ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.20 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. అలాగే, ఇతర కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొననున్నారు. రామన్న రాక నేపథ్యంలో నగరం గులాబీమయంగా మారింది. అధికార యంత్రాంగంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనూ విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రామారావుకు ఘన స్వాగతం పలికేందుకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో భారీగా సన్నాహాలు చేస్తున్నారు.
– నిజామాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు వస్తున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం వస్తున్న ఆయనకు ఘనంగా స్వాగతించేందుకు అధికార పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. నగరం ఇప్పటికే గులాబీమయమైంది. మరోవైపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు సైతం ఉండడంతో అధికార యంత్రాంగం ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద నిర్మిస్తున్న కళాభారతికి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితోపాటు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి భూమి పూజ చేయబోతున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రైల్వే కమాన్ వద్ద నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని అధికారికంగా కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీగా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం రామన్న రాక నేపథ్యంలో ఘనంగా వెల్కమ్ చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
సీఎం ఆలోచనలతో పాత కలెక్టరేట్ భవంతి ఇప్పటికే నేలమట్టమైంది. ప్రగతిభవన్, అక్షర భవన్, పాత రెవెన్యూ భవన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, స్కౌట్స్ అండ్ గైడ్ గదులన్నింటినీ పూర్తిగా తొలగించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎం ఆదేశాలతో చకచకా కూల్చివేతలను చేపట్టారు. దాదాపు 40 రోజులపాటు శ్రమించి భారీ భవంతులను తొలగించి శిథిలాలను దూర ప్రాంతానికి తరలించారు. ఇప్పుడీ ప్రాంతాన్ని నిర్మాణానికి అనువుగా మార్చారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు ముందటి భాగంలోనే రూ.50కోట్ల నిధులతో అత్యద్భుతమైన కళాభారతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నది. నిజామాబాద్ జిల్లాకు గర్వకారణంగా నిలిచే కళాభారతి ఆడిటోరియాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దబోతున్నారు. అంతేకాకుండా ఆధునిక వసతులతోపాటు నగరవాసులకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించేందుకు ఇందులో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి దాదాపు 2వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా కళాభారతి నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లుగా తెలుస్తున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో స్పీడ్గా భవనాల తొలగింపు జరిగినట్లే ఆడిటోరియం పనుల ప్రారంభం కూడా ఊహించిన దాని కన్నా వేగంగా మొదలై పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
నిజామాబాద్ నగరం గులాబీమయమైంది. నగరానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నందున భారీగా స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూడలిలో బీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాన రహదారులతోపాటు చౌరస్తాలన్నీ గులాబీమయం కావడంతో నగరమంతా కొంగొత్తగా కనిపిస్తున్నది. నిజామాబాద్ శివారు ప్రాంతాల నుంచి మొదలు పాత కలెక్టరేట్ వరకు ఘనంగా స్వాగత తోరణాలు పర్చుకున్నాయి. డివైడర్ల మీదుగా గులాబీ జెండాలను సైతం అలంకరించారు. మంత్రి కేటీఆర్ పర్యటించే దారులన్నీ బీఆర్ఎస్ జెండాలతో కళకళలాడుతున్నాయి.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాక సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేశాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఘనంగా స్వాగతం పలికేందుకు శ్రేణులు పెద్ద ఎత్తున సమాయత్తమయ్యారు. కేటీఆర్ పర్యటనలో రైల్వే అండర్ బ్రిడ్జి, నూతన రహదారిని ప్రారంభిస్తారు. అనంతరం పాత కలెక్టరేట్ స్థలంలో కళాభారతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. పురపాలక మంత్రిగా కేటీఆర్ అందించిన ప్రోత్సాహంతో నిజామాబాద్ నగరం నలుమూలలా అభివృద్ధి చెందుతున్నది.
నిజామాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తున్నప్పటికీ రైల్వేకమాన్ వద్ద దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం ఎవరూ చూపించలేదు. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి అనతి కాలంలోనే ప్రజల అవసరాలను గుర్తించి పనులను పూర్తి చేస్తున్నది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఈ సమస్యపై దృష్టిసారించి ప్రభుత్వం ద్వారా నిధులు సమీకరించి ప్రత్యామ్నాయ రోడ్డును రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించారు. రూ.20కోట్లు వెచ్చించి నిర్మించిన ఆర్యూబీ ద్వారా నగరవాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు పూర్తిగా తీరిపోయాయి. కంఠేశ్వర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు రందీ లేకుండా రాకపోకలు సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే పనులు పూర్తి కాగా అధికారికంగా రైల్వే అండర్ బ్రిడ్జిని నేడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించడంతో ప్రజల అవసరాలను తీర్చబోతున్నది. తుది మెరుగులను ఇప్పటికే సంబంధిత శాఖ పూర్తి చేసింది. ఆర్యూబీ వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా పూల మొక్కలు, పచ్చని చెట్లను సైతం ఏర్పాటు చేయడంతో ఈ మార్గం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఆర్యూబీ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధతో నిధుల భారాన్ని మోసింది.
ఖలీల్వాడి, జనవరి 27: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ క్యాంప్ కార్యాలయం నుంచి బయల్దేరి, 8.15గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి 8.45గంటలకు నూతన కలెక్టరేట్ సముదాయనికి చేరుకుంటారు. 9 గంటలకు భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కాకతీయ సాండ్బాక్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.15గంటలకు రైల్వేకమాన్ వద్ద ఆర్యూబీ, రహదారిని ప్రారంభించనున్నారు. 11.30గంటలకు పాత కలెక్టరేట్ మైదానంలో ఇందూరు కళాభారతి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 12.30గంటలకు తెలంగాణ భవన్లో ప్రెస్మీట్, 1 గంటలకు సరస్వతీ నగర్లోని విశ్వం డయాగ్నోస్టిక్ సెంటర్ని ప్రారంభిస్తారు. అనంతరం 1.15 గంటలకు నూతన కలెక్టరేట్ నుంచి హెలికాప్టర్ ద్వారా 2 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామరావు శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీసు కమిషనర్ నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్తో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. పాత కలెక్టరేట్ వద్ద కళాభారతి ఆడిటోరియం నిర్మించే ప్రాంతంతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జి, భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ను సందర్శించారు. మంత్రి హెలికాప్టర్లో రానుండడంతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలీప్యాడ్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లోటుపాట్లకు తావులేకుండా మంత్రి కేటీఆర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతాపరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురళీ మనోహర్రెడ్డి, నగర పాలక సంస్థ ఇంజినీర్ రషీద్, ట్రాన్స్కో ఏడీఈ రాజశేఖర్ ఉన్నారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జిల్లా కేంద్రానికి శనివారం రానున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.నాగరాజు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ను అడ్డగించినా, ప్లకార్డులు ప్రదర్శిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ నాగరాజు హెచ్చరించారు.