‘కేసీఆర్ గొంతు నొక్కాలని మోదీ, షా చూస్తున్నారు. అయినా మేం వారికి భయపడేది లేదు. తల నరుక్కుంటాం కానీ ఢిల్లీకి తలవంచేది లేదు. మోదీని ఢీకొట్టేది కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకే లాభమని గుర్తుంచుకోవాలి.
ఖలీల్వాడి, నవంబర్ 25 : అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు కాంగ్రెస్ చేసిందేమిటని.. వారిని అడుగడుగునా మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతంలో శనివారం నిర్వహించిన రోడ్షోలో పాల్గొని మాట్లాడారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్లో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. జిల్లాలో ఐటీ హబ్, సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, యువతకు స్కిల్స్ నేర్పించేందుకు న్యాక్ భవనం ఎవరు కట్టారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నిధులు మంజూరు చేసుకొని నిర్మించుకున్నామన్నారు. అదే విధంగా నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. కరోనా సమయంలోనూ బిగాల గణేశ్ గుప్తా నగరవాసులకు అండగా నిలబడ్డారని.. పెద్దమనసుతో అన్నదానాలు చేశాడన్నారు. గణేశ్ గుప్తా నగరవాసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని.. షబ్బీర్ అలీ గెలిస్తే మీకు పని పడితే ఎక్కడికి పోతారని, ఒక్కసారి ఆలోచించాలన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు నగరం ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో గణేశ్ గుప్తా చేసిన అభివృద్ధి మీ ముందే ఉందన్నారు.
తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మినీ ట్యాంక్బండ్ను అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. కరోనా సమయంలో రెండుసార్లు సొంత ఖర్చులతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి, కరోనా రోగులకు ప్రతి రోజూ వేల మందికి అన్నం పెట్టాడని, మరి ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ గల్లీలో ఎప్పుడైనా కనిపించాడా అని ప్రశ్నించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డిలో 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు ఓడిపోయాడని, కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నారు. కేసీఆర్ 9 ఏండ్లలో మైనార్టీల సంక్షేమానికి రూ.12,780 కోట్లు ఖర్చు చేస్తే.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ రూ.930 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాహుల్గాంధీ వచ్చి మైనార్టీలు పేదవాళ్లని అంటాడని.. 55 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని? 11 సార్లు కాంగ్రెస్కు అధికారం ఇస్తే ప్రతిసారీ అన్యాయం చేశారన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని కాంగ్రెస్ అంటున్నదని కానీ ఇప్పటివరకు కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. కేసీఆర్ గొంతు నొక్కాలని మోదీ,షా చూస్తున్నారన్నారు. వారికి భయపడేది లేదన్నారు.
అవసరమైతే తలనరుక్కుంటామని.. ఢిల్లీ వాళ్లకు తలవంచేది లేదన్నారు. బీజేపీ, మోదీని ఢీకొట్టే దమ్ము కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది బీజేపీకే లాభం జరుగుతుందన్నారు. 9 ఏండ్లలో గణేశ్ గుప్తా చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే ఉందని.. మరోసారి గెలిపిస్తే నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారన్నారు. బీఆర్ఎస్ గెలిచిన వెంటనే రూ.400 సిలిండర్, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు సౌభాగ్యలక్ష్మి ద్వారా రూ.3 వేల భృతి, రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి సన్నబియ్యం ఇస్తామని, ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి, నగర మేయర్ దండు నీతూకిరణ్, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఎ.అలీం, మీర్ మజాజ్ అలీ, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ ఖుద్దూస్, కరీమొద్దీన్, కమల్, బబ్లూఖాన్, బబ్బు పాల్గొన్నారు.