బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది.. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.. ఖమ్మం జిల్లాకేంద్రం సమీపంలోని వీ వెంకటాయపాలెంలో ఈ నెల 18న కనీ విని ఎరుగని రీతిలో సభ జరుగనున్నది. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్మాన్ హాజరుకానున్నారు.. వంద ఎకరాల సువిశాల స్థలం.. 15 వేల మంది వీఐపీలు కూర్చునేందుకు గ్యాలరీలు.. ప్రజలు సభను వీక్షించేందుకు 50 ఎల్ఈడీ తెరలు.. వాహనాల పార్కింగ్కు 400 ఎకరాలు.. వెయ్యి మందికి పైగా వలంటీర్లు.. 70 అడుగులకుపైగా అతిథుల కటౌట్లు.. సుమారు 4 లక్షల మందికి పైగా జనం హాజరయ్యే అవకాశం.. మొత్తానికి సభ దేశ ప్రజలు ఔరా.. ! అనేలా కొనసాగనున్నది.
ఏర్పాట్లను సభ ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పర్యవేక్షిస్తున్నారు. సభ బందోబస్తును ఏడుగురు ఐపీఎస్లు పర్యవేక్షించనున్నారు.. వీరంతా సోమవారమే బాధ్యతలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్శాఖ చర్యలు తీసుకుంటున్నది. సభ సందర్భంగా నగరం గులాబీమయమైంది. గులాబీ జెండాల రెపరెపలు.. స్వాగత తోరణాలతో కళకళలాడుతున్నది..