బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 14 : ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో విద్యతోపాటు వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ – కోనాపూర్ గ్రామాల మధ్య రూ.12 కోట్లతో చేపట్టనున్న గిరిజన బాలికల భవన నిర్మాణం కోసం బోర్లం సొసైటీ అధ్యక్షుడు సంగ్రాం నాయక్, కోనాపూర్ సర్పంచ్ వెంకటరమణారావుతో కలిసి గురువారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. అత్యాధునిక హంగులతో పాఠశాల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి త్వరలో భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు.
నిరుపేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన అంగ్ల విద్యను అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ సహకారంతో గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంజూరుచేయించినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచే తరగతులు నస్రుల్లాబాద్ బాలుర గిరిజన గురుకుల పాఠశాలలో ప్రారంభమైనట్లు చెప్పారు. శాశ్వత భవనం త్వరలోనే నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను మంజూరు చేస్తూ బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. అనంతరం హన్మాజీపేట్లో రూ. 65 లక్షలతో చేపడుతున్న మున్నూరు కాపు సంఘ కల్యాణ మండపం నిర్మాణ పనులను పరిశీలించారు.
బీర్కూర్ మండల కేంద్రంలో రూ.6.70 కోట్లతో నిర్మించిన బీసీ గురుకుల బాలుర పాఠశాల భవనాన్ని సభాపతి పోచారం స్థానిక నాయకులు,అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. పనులు త్వరగా పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల16న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం దామరంచ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేశారు.