బాన్సువాడ టౌన్, మార్చి 29: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో రూ.41 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల కోసం సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత (ఇంగ్లిష్ మీడియం) విద్యను అందిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు, ఆధునిక, మౌలిక సదుపాయాలను కల్పించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో పాఠశాలల పాత భవనాలను తొలగించి, నూతన భవనాలను నిర్మించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం తన వంతు అని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడడం విద్యార్థుల బాధ్యత అని స్పష్టం చేశారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలని సూచించారు. పాఠశాల విద్య అనంతరం ఉన్నత విద్యకోసం ఎటు వెళ్లకుండా బాన్సువాడ పరిధిలోనే అన్ని రకాల కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్ గౌడ్, బాన్సువాడ విండో చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ గుప్తా, కౌన్సిలర్లు గంగారపు కిరణ్ కుమార్, దొన్కంటి వెంకటేశ్, లింగమేశ్వర్, బాడీ శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, పార్టీ నాయకులు నార్ల ఉదయ్, మోచి గణేశ్, ఆగమయ్య, ఉప్పరి లింగం, కనుకుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.