విద్యానగర్, నవంబర్ 23 : ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిరుమలరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పాఠశాలలు, వసతి గృహాలకు అందించే ఆహారంపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలు, వసతి గృహాల్లో భోజనం వికటించకుండా అధికారులు పర్యవేక్షణ చేసి అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఆర్డీవో సాయన్న, జిల్లా విద్యా, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. రుచి ఉత్సవ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. సుమారు 43 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిరుమలరెడ్డి హాజరయ్యారు. స్టాళ్లను పరిశీలించి, వంటకాలను రుచి చూశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఐరన్ లోపం అధికంగా ఉంటుందని చెప్పారు. సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ను స్ఫూర్తిగా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం, పాఠశాల విద్యావిభాగం, కామారెడ్డి ఆర్యభట్ట సైన్స్ క్లబ్, రామన్ స్కాటర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఖగోళ శాస్త్ర సెమినార్, ఖగోళ వీక్షణ కార్యక్రమం గోడప్రతులను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ స్కూల్లో గురువారం సెమినార్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య, వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమ సమన్వయ కర్త కృష్ణమోహన్, అకడమిక్ కో-ఆర్డినేటర్ రాజ్కుమార్, రామకృష్ణ, అధ్యాపకులు రాణి, శంకర్, జ్యోత్స్న, వెంకటేశ్వర్లు, శివకుమార్, రామస్వామి, రాజ్గంభీర్రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.